NTV Telugu Site icon

KCR Protest: నేడు బీఆర్‌ఎస్‌ రాష్ట్రవ్యాప్త నిరసన.. శ్రేణులకు కేసీఆర్‌ పిలుపు

Kcr

Kcr

KCR Protest: నేడు రాష్ట్ర వ్యాప్తంగా నియోజక వర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసన తెలపాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన అనంతరం వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని కాంగ్రేస్ ప్రభుత్వం ప్రకటించి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రైతాంగాన్ని మరోసారి వంచించడమే అన్నారు.

కాంగ్రెస్ సర్కార్ రైతులకు మోసం, దగా చేయడమేనని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలా ప్రకటిస్తుంది? అని ప్రశ్నించారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం ద్వారా తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి వంచించిందన్నారు. ఓట్లు డబ్బాలో పడంగనే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరిందన్నారు. అందుకే నాలిక మల్లేసి ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పూనుకున్నారు.

Read also: Bollywood Hero : భార్య పేరున్న టాటూను తొలగించిన హీరో..విడాకులు తీసుకోబోతున్నారా?

ఇదే సన్న వడ్లకు మాత్రమే అనే మాట ఎన్నికలకు ముందు గనుక చెప్పింటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కు తుక్కు చేసేవాళ్లని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ ప్రజలు కాంగ్రెస్ పై ఆగ్రహం తోనే ఉన్నారు. రైతు బంధు, రైతు భరోసా ఇవ్వకుండా రైతాంగాన్ని అన్నిరకాలుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందన్నారు. అందు కారణంగానే రైతాంగ హక్కులను హామీలను సాధించేందుకే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టిందని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతులపక్షాన నిలబడి కొట్లాడాలని పిలుపునిచ్చారు.

ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనడానికి నిర్లక్ష్యం వహిస్తూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడిపిస్తూ గోస పుచ్చుకుంటుందన్నారు. రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించేదిశగా నిరసన కార్యక్రమాలతో పాటు.. ప్రతిరోజూ వడ్ల కల్లాలకాడికి బీఆర్ఎస్ శ్రేణులు పోవాలని, రైతులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రైతుల హక్కులను కాపాడేందుకు వారికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని కేసీఆర్ పునరుద్ఘటించారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా.. రాష్ట్ర వ్యాప్త నిరసనకు కేసీఆర్ పిలుపు ఇచ్చారు.
AP EAPCET: నేటి నుంచే ఏపీ ఈఏపీసెట్‌.. నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ!