తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తెలంగాణ ప్రజల ముందుకు ఒక కొత్త రాజకీయ వేదికతో వచ్చారు. ప్రజల సమస్యలను ఎత్తి చూపే ప్రశ్నించే గొంతుకగా తన పార్టీ పని చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. పాలక పక్షం, ప్రతిపక్షం తేడా చూడకుండా అన్ని అంశాలపై మాట్లాడతామని ప్రకటించారు. జాగృతి NGOగా కొనసాగుతూ, ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు ఎదురైనా తాను చెప్పిన మాట మీద, పట్టిన తోవ మీద నిలబడతానని కవిత అన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ముందడుగు వేయాలని కవిత సూచించారు. “ధాన్యం కొనండి. రైస్ ఎగుమతి చేసే పరిస్థితి ఉంది. కార్పొరేషన్ పెట్టి ఎగుమతి చేయండి. రైస్ లైసెన్స్ తీసుకోండి” అని ప్రభుత్వానికి సూచించారు.
ప్రస్తుత పాలకులకు “అమ్మతనం” లేదని, అందుకే పరిపాలన సరిగా జరుగడం లేదని విమర్శించారు. “అమ్మగా నేను ఉంటా” అని చెప్పినందుకు కొందరు అవాకులు చెవాకులు పేలుస్తున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. సర్వోదయ తెలంగాణ సాధనే తన లక్ష్యమని చెప్పిన కవిత, 60 వేలకు పైగా భూ నిర్వాసితుల పక్షాన నిలబడతానని ప్రకటించారు. గురుకులాల్లో పిల్లలు పిట్టల్లా చనిపోతున్న విషయంపై మండిపడ్డారు. విద్యాశాఖ సీఎం దగ్గరే ఉన్నా, సమీక్షలు కూడా చేయడం లేదని విమర్శించారు. వచ్చే రెండున్నరేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం పై కోట్లాడతానని హెచ్చరించారు.
గ్రూప్-1లో అవినీతి జరిగిందంటే బుల్డోజ్ చేసి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. “ఫ్యూచర్ సిటీ కాదు… ఫ్యూచర్ లెస్ సిటీ. అదో రియల్ ఎస్టేట్ మాయ” అని వ్యాఖ్యానించారు. మహిళలపై అత్యాచారాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక పెరిగాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం సెక్రటేరియట్కు రావడం లేదని, వాస్తు సమస్య ఉండవచ్చని ఎద్దేవా చేశారు. హైదరాబాద్లో మంత్రుల ఇండ్లకు వెళ్లడం లేదన్నారు. BRSలో ఉన్నప్పుడు అనేక అవినీతి, అక్రమాలపై ఆధారాలు కేసీఆర్కు ఇచ్చానని, అప్పుడు ఆయన బాస్ కాబట్టి చెప్పిన పని చేశానని కవిత చెప్పారు. తల్లిదండ్రులను గౌరవిస్తానని, BRS అధ్యక్షుడిగా మాత్రమే కేసీఆర్ను విమర్శిస్తానని స్పష్టం చేశారు.
పది సార్లు పేపర్ లీకులు జరగడంపై కేటీఆర్ను ప్రశ్నించారు. “విదేశాలు తిరిగే కేటీఆర్ పరీక్ష పత్రాలు లీక్ కాకుండా టెక్నాలజీ వాడలేరా?” అని నిలదీశారు. తెలంగాణ రక్షణ సేనను ఎన్నికల కమిషన్ గుర్తించినా, ఆ పేరు రానివ్వకుండా కుట్రలు జరిగాయని ఆమె ఆరోపించారు. ఆ కుట్రల నుంచి బయటపడటానికి కొన్ని టెక్నిక్స్ వాడాల్సి వచ్చిందని వెల్లడించారు. బీజేపీకి తెలంగాణలో స్పేస్ లేదని, ధర్మపురి అరవింద్ బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్లో చాలా మంది చాలా మాట్లాడతారని, కానీ రాజకీయ పార్టీగా ఉండటమే పవర్ అని, తన పవర్ ఏమిటో కాలమే సమాధానం చెప్తుందని చెప్పారు. తన టార్గెట్ BRS కాదు, కాంగ్రెస్ కాదని, సర్వోదయ తెలంగాణకు అడ్డువచ్చే వారిని విమర్శిస్తానని కవిత స్పష్టం చేశారు.
