Site icon NTV Telugu

Kaushik Reddy : ప్రభుత్వానిది మైనింగ్ స్కామ్.. నా పర్సనాలిటీపై ఏడిస్తే ఎలా.?

Padi Kaushik Reddy

Padi Kaushik Reddy

తెలంగాణ రాజకీయాల్లో మైనింగ్ కుంభకోణం , అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాయి. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మైనింగ్ స్కామ్ నుండి తన వ్యక్తిగత పర్సనాలిటీ వరకు ప్రతి అంశంపై ఆయన క్లారిటీ ఇస్తూనే, అధికార పార్టీ తీరును తప్పుబట్టారు.

రాష్ట్రంలో జరుగుతున్న మైనింగ్ కుంభకోణంపై మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ఆధారాలతో సహా అన్ని విషయాలను బయటపెట్టారని కౌశిక్ రెడ్డి గుర్తు చేశారు. “నిజంగా ప్రభుత్వం దగ్గర సమాధానం ఉంటే హరీష్ రావు అడిగినట్లు హౌస్ కమిటీ ఎందుకు వేయడం లేదు?” అని ఆయన ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భాగస్వామ్యం ఉందని, ఆ కారణం చేతనే ఈ స్కామ్‌పై విచారణకు ప్రభుత్వం వెనకాడుతోందని ఆయన సంచలన ఆరోపణ చేశారు.

PM Modi: తేయాకు తోటలో కూలీలతో కలిసి పని చేసిన మోడీ.. ఫొటోలు వైరల్

తనపై ఎథిక్స్ కమిటీ వేయడంపై కౌశిక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తనను టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఎమ్మెల్యే దానం నాగేందర్ వాడిన భాష ఎథిక్స్ కమిటీ పరిధిలోకి రాదా అని నిలదీశారు. తన వ్యక్తిగత పర్సనాలిటీపై చేసిన కామెంట్లకు బదులిస్తూ.. “నేను స్పోర్ట్స్ పర్సన్‌ని. అండర్-19 క్రికెట్ ఆడే సమయంలో దేశంలోనే ఫిట్టెస్ట్ ప్లేయర్‌గా ఉన్నాను. 20 ఏళ్ల కష్టం ఈ బాడీ. నా పర్సనాలిటీ మీద ఏడిస్తే ఎలా?” అంటూ ఘాటుగా స్పందించారు. ఎథిక్స్ కమిటీ ముందు అన్ని విషయాలను ధైర్యంగా చెబుతానని వెల్లడించారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కూడా కౌశిక్ రెడ్డి విమర్శలు సంధించారు. “కడియం శ్రీహరి గారు.. కేసీఆర్ మీకు ఏం తక్కువ చేశారు? అసలు మీరు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో అసెంబ్లీలో స్పష్టం చేయమని అడిగితే తప్పేంటి?” అని ప్రశ్నించారు. కడియం వ్యవహారశైలిపై అసెంబ్లీలో తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదని ఆయన పేర్కొన్నారు.

హుజురాబాద్‌లోని డంపింగ్ యార్డ్ ఏర్పాటును అడ్డుకోవడానికి తాను ఈ నెల 4న చేపట్టిన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి సిఐడి నోటీసులు ఇచ్చారని కౌశిక్ రెడ్డి తెలిపారు. “కరీంనగర్ సీపీ మీద వేయాల్సిన సిఐడి ఎంక్వైరీ నా మీద వేశారు. 4వ తేదీన విచారణకు పిలిస్తే వెళ్తాను, కానీ 5 లేదా 6వ తేదీల్లో డంపింగ్ యార్డును అడ్డుకుని తీరుతాను” అని ప్రకటించారు. అలాగే, ప్రస్తుతం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసు అధికారులపై మండిపడుతూ.. భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సిఐడి విచారణలు పోలీసుల మెడకే చుట్టుకుంటాయని హెచ్చరించారు.

Prabhas : బైకర్ కోసం యుద్ధ భూమి నుండే వచ్చేశాడు డ్యూడ్!

Exit mobile version