ఈటలకు మరో షాక్ తగిలింది. జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ తక్కలపెల్లి రాజేశ్వరరావు, ఎంపీపీ దొడ్డే మమతతో పాటు 12 మంది కౌన్సిలర్లు, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు సింగిల్విండో చైర్మన్ లు నాయకులు టీఆర్ఎస్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి కెసిఆర్, కేటీఆర్ నాయకత్వంలో పని చేస్తామని ప్రకటించారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించడంతో తెలంగాణను సాధించుకున్నామన్నారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో పాల్గొన్న వారికి మంత్రి పదవులు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చారని..తెలంగాణ సాధించుకున్న తర్వాత రెండవసారి అధికారంలోకి రావడానికి ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టి బిజెపి, కాంగ్రెస్ ను ప్రజలు మట్టికరిపించారని తెలిపారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్.. కెసిఆర్ తో ఉండవలసి అవసరం ఉండేదని.. కానీ ఈటల వ్యవహారం వల్లనే కేబినెట్ నుంచి సిఎం కెసిఆర్ బహిష్కరించారని పేర్కొన్నారు. కేబినెట్ లో ఉండి పదవులను పొందిన ఈటల..కేసీఆర్ దగ్గర ఉండకుండా వేరే దగ్గర మీటింగులు పెట్టి ఈ స్థితికి దిగజారాడని ఫైర్ అయ్యారు. మీటింగులు పెట్టిన సందర్భంలో హుజురాబాద్ ప్రజలను, ప్రజాప్రతినిధులను ఆలోచించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారని ఈటలపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల నుంచి సర్పంచ్ వరకు అందరూ కెసిఆర్ ఇచ్చిన బీ ఫామ్ తో, కారు గుర్తు మీద గెలిచిన వాళ్లేనని పేర్కొన్నారు. పార్టీ గుర్తు మీద గెలిచిన మేమంతా కేసీఆర్ తోనే టిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతామని తెలిపారు.