Aadi Srinivas : కేసీఆర్కు వారం రోజులు కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగిస్తే తెలంగాణ మొత్తానికి నీళ్లు ఇస్తామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ మాటలు ఉత్తర కుమార ప్రగల్భాలను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. 2016 మే నెలలో కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, 2019 జూన్లో ప్రారంభించారని.. ఆనాటి నుండి 2023 డిసెంబర్ వరకు (దాదాపు 209 వారాల పాటు) ఈ ప్రాజెక్టు కేసీఆర్ చేతిలోనే ఉందని గుర్తుచేశారు. వారం రోజుల్లో నీళ్లిచ్చే అంత తెలివి ఉంటే, గతంలోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయినప్పుడు కేసీఆర్ ఎందుకు రిపేర్ చేయించలేకపోయారని ప్రశ్నించారు. మెదడు, రక్తం, చెమటను రంగరించి కాళేశ్వరాన్ని డిజైన్ చేశానని, తాను అపర భగీరథుడినని చెప్పుకున్న కేసీఆర్.. మేడిగడ్డ పిల్లర్లు కుంగినప్పటి నుండి ఇప్పటివరకు ఎందుకు స్పందించడం లేదని దుయ్యబట్టారు. లక్ష కోట్లు గోదావరి పాలు చేసినందుకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురూ లెంపలేసుకుని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కమిషన్ల కోసమే తప్పుడు డిజైన్లు.. కరెంట్ బిల్లుల వృథా
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసమే ఎలాంటి పద్ధతి, సరైన డిజైన్ లేకుండా ఇష్టానుసారంగా కాళేశ్వరాన్ని నిర్మించిందని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. అంతకుముందు 30 శాతం పనులు పూర్తయిన చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టును పక్కనబెట్టి కాళేశ్వరం కట్టారని మండిపడ్డారు. కన్నెపల్లి పంప్హౌస్ గతంలో రెండుసార్లు మునిగిపోయి, మోటర్లు కాలిపోయిన విషయం కేటీఆర్కు తెలియదా అని ప్రశ్నించారు. గతంలో కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తి మళ్లీ సముద్రంలోకి వదిలారని.. భారీగా కరెంట్ బిల్లులు దండగ కావడం తప్ప ఆ ప్రాజెక్టు వల్ల సాధించిందేమీ లేదన్నారు. ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు లేకపోయినా కాంగ్రెస్ హయాంలో రికార్డు స్థాయిలో ధాన్యం పండించి దేశంలోనే నెంబర్ వన్గా నిలిచామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే రైతులు విత్తనాలు విత్తుకుంటుంటే.. పంటలు ఎండిపోతున్నాయంటూ కేటీఆర్ దుర్బుద్ధితో అబద్ధాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారమే నిర్ణయాలు.. జైలుకు వెళ్లడం ఖాయం
ప్రాజెక్టులను ఎలా మెయింటైన్ చేయాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బాగా తెలుసని, రాష్ట్రంలోని 90 శాతం ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీయే నిర్మించిందని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. మేడిగడ్డలో నీళ్లు ఆపితే డ్యాం కొట్టుకుపోతుందని, కింద ఉన్న గ్రామాలు మునిగిపోతాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) స్పష్టంగా చెప్పిందని, అలాగే అన్నారం, సుందీళ్ల బ్యారేజీల్లో సీపేజీలు (బుంగలు) పడ్డాయని తెలిపారు. ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశాలు లేవని, ఎన్డీఎస్ఏ సూచనల ప్రకారమే నడుచుకుంటామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో 50 వేల మందితో వెళ్లి పంపులు ఆన్ చేస్తామనడం సంఘ విద్రోహ చర్య అవుతుందని హెచ్చరించారు. కాళేశ్వరం అవినీతిపై అసెంబ్లీలో తీర్మానం చేసి సీబీఐ (CBI) విచారణకు పంపామని.. బీజేపీతో బీఆర్ఎస్ చేస్తున్న ములాఖత్ రాజకీయాల వల్లే విచారణ ఆలస్యమవుతోందని, నిష్పక్షపాతంగా విచారణ జరిగితే బీఆర్ఎస్ నేతలు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. కేసీఆర్ ఇప్పటికైనా అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరంపై మాట్లాడాలని, ఆయన ప్లాన్లేంటో తాము కూడా వింటామని ఆది శ్రీనివాస్ సవాల్ విసిరారు.

