Charlapalli Jail: మారిపోయిన ఖైదీలను కేవలం జైలు నుంచి వదిలేయడమే కాకుండా వారికి ఉపాధి ఏర్పాటు చేసి బయటకు పంపించాలని అధికారులు నిర్ణయించారు. క్షమాభిక్షకు అర్హులైన ఖైదీలకు నేడు చర్లపల్లి సెంట్రల్ జైలులో జాబ్ మేళా నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జైళ్లల్లో 213 మంది క్షమాభిక్షకు ఎంపిక చేశారు. క్షమాభిక్షపై విడుదలయ్యే ఖైదీలకు జాబ్ మేళా ద్వారా జైళ్ల శాఖ అధికారులు ఉపాధి కల్పించనున్నారు. ఆసక్తి, అర్హత మేరకు విడుదల కానున్న ఖైదీలకు ఉపాధి కల్పించనున్నారు. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పెట్రోల్ బంకులతోపాటు డ్రైవర్లు, డేటా ఆపరేటర్లు, ఇతర విభాగాల్లో వారి ఆసక్తి మేరకు ఖైదీలకు ఉపాధి అవకాశం లభించనుంది. అవసరమైన వారికి అర్హత బట్టి ప్రైవేటు సంస్థల్లో కూడా ఉపాధి కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు.
Read Also: MLC Kavitha: కవితకు జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే..?
ఇప్పటికే ఖైదీల విడుదలకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. చర్లపల్లి జైలులో జరిగే జాబ్ మేళా కార్యక్రమానికి ఐజీ వై రాజేష్, డీఐజీ మురళి బాబు, జైళ్ల శాఖ అధికారులు హాజరు కానున్నారు.తెలంగాణలోని అన్ని జైళ్ల నుంచి అధికారులు ఖైదీలను విడుదల చేయనున్నారు. ఇతర జైళ్ల నుంచి విడుదలయ్యే ఖైదీలను ఇప్పటికే అధికారులు చర్లపల్లి జైలుకు తీసుకువచ్చారు. 213 మంది ఖైదీలు నేడు విడుదల కానున్నారు. ఇప్పటికే జైలు వద్దకు ఖైదీల కుటుంబ సభ్యులు చేరుకున్నారు.
జైళ్ళ వారీగా విడుదల అవుతున్న ఖైదీల వివరాలు
చర్లపల్లి కేంద్ర కార్యాలయం- 61 మంది ఖైదీలు
హైదరాబాద్ కేంద్ర కారాగారం- 27
వరంగల్ కేంద్ర కారాగారం- 20
చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు – 31
మహిళల ప్రత్యేక కారాగారం- 35
సంగారెడ్డి కేంద్ర కారాగారం -1
నిజామాబాద్ కేంద్ర కారాగారం – 15
మహబూబ్నగర్ జిల్లా జైలు – 2
నల్గొండ జిల్లా జైలు – 4
ఆదిలాబాద్ జిల్లా జైలు – 3
కరీంనగర్ జిల్లా జైలు – 7
ఖమ్మం జిల్లా జైలు – 4
ఆసిఫాబాద్ స్పెషల్ సబ్ జైలు- 3
మొత్తం 213 మంది ఖైదీలు ఈ రోజు విడుదల అవుతున్నారు.