నేడు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హెలికాప్టర్ లో శివునిపల్లెకు చేరుకోనున్నారు సీఎం. అక్కడ ఏర్పాటు చేసిన ఇందిరామహిళా శక్తి స్టాల్స్ను పరిశీలించనున్నారు. అనంతరం.. రూ.800 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు. కాగా.. సీఎం టూర్ ఏర్పాట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య పర్యవేక్షించారు. హెలిప్యాడ్, పార్కింగ్, భద్రత ఏర్పాట్లను సీపీ సన్ ప్రీత్ సింగ్ పర్యవేక్షించారు.
Read Also: IML T20 2025 Final: నేడే ఇండియా – వెస్టిండీస్ ఫైనల్ మ్యాచ్.. లైవ్ ఎక్కడ చూడొచ్చంటే?
సీఎం టూర్ నేపథ్యంలో స్టేషన్ ఘన్పూర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం టూర్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా పొలిటికల్ హీట్ రగులుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సభను అడ్డుకుంటామని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తుగ్లక్ ముఖ్యమంత్రి అని తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి భారతదేశంలోనే అట్టర్ ఫ్లాప్ అయిన ముఖ్యమంత్రి అని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు కాకుండా సిగ్గు, శరం లేకుండా రేవంత్ రెడ్డి వస్తున్నాడు.. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికైనా పోవచ్చు కానీ స్టేషన్ ఘన్పూర్కు రావద్దని అన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొడతానన్నది కడియం శ్రీహరే.. పార్టీ మారిన వారిని పిచ్చి కుక్కను కొట్టినట్టు రాళ్ళతో కొట్టండని రేవంత్ రెడ్డి అన్నారు.. కడియం శ్రీహరికి శీల పరీక్ష చెయ్యాలి.. కడియం శ్రీహరి మీద మొదటి రాయి రేవంత్ రెడ్డి వెయ్యాలని తాడికొండ రాజయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాయి తరువాత కడియం శ్రీహరి పై రెండో రాళ్ళు వేసేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో స్టేషన్ ఘన్పూర్లో ఒక కొత్త పని మొదలుపెట్టి తట్ట మట్టి తియ్యలేదని తాటికొండ రాజయ్య ఆరోపించారు.
Read Also: Alia Bhatt : డేర్ చేస్తున్న అలియా భట్.. తేడా వస్తే అంతే
మరోవైపు.. స్టేషన్ ఘన్పూర్లో అరెస్టులు కొనసాగుతున్నాయి. సీఎం టూర్ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. సీఎం టూర్ను అడ్డుకుంటామని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. ఈ క్రమంలో.. స్టేషన్ ఘన్పూర్లో తాటికొండ రాజయ్యను హౌస్ అరెస్ట్ చేశారు. తాటికొండ రాజయ్య ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. సీఎం టూర్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల చర్యలు తీసుకుంటున్నారు.