తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం మున్సిపల్ పీఠాలను దక్కించుకునే క్రమంలో రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా జనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సోమవారం (ఫిబ్రవరి 16) నాటకీయ పరిణామాల మధ్య వాయిదా పడింది. మున్సిపల్ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఆందోళనలు, కౌన్సిల్ హాల్లో సభ్యుల మధ్య నెలకొన్న గందరగోళం వల్ల సభ నియంత్రణలో లేదని, అందుకే ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఆర్డీఓ ప్రకటించారు.
Tollywood : టాలీవుడ్ డెబ్యూకి బాలీవుడ్ బ్యూటీస్ రెడీ
జనగామ మున్సిపాలిటీలోని 30 వార్డులకు గానూ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ‘హంగ్’ ఏర్పడింది. బీఆర్ఎస్ అత్యధిక సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, అధికారం దక్కించుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా పీఠం దక్కించుకోవడానికి ప్రయత్నిస్తుండటంతో, స్వతంత్ర అభ్యర్థులు ఇప్పుడు కింగ్ మేకర్లుగా మారారు. ఈ నేపథ్యంలోనే కౌన్సిలర్ల మద్దతు కూడగట్టే క్రమంలో తీవ్రస్థాయిలో రాజకీయ ఎత్తుగడలు మొదలయ్యాయి.
ఎన్నికకు ముందు జనగామలో కిడ్నాప్ కథనాలు కలకలం రేపాయి. తమ కౌన్సిలర్లను ప్రత్యర్థి పార్టీలు కిడ్నాప్ చేశాయని ఒక వర్గం ఆరోపించగా, పోలీసుల ఒత్తిడితో అక్రమంగా కేసులు పెడుతున్నారని మరో వర్గం నిరసన వ్యక్తం చేసింది. మున్సిపల్ కార్యాలయం వెలుపల వివిధ పార్టీల కార్యకర్తలు భారీగా గుమిగూడి నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది.
ఎన్నిక వాయిదా పడటంపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. తాము విజయం సాధిస్తామనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎన్నికను పోస్ట్పోన్ చేయించిందని మండిపడ్డారు. అధికారుల తీరు ప్రజాస్వామ్య విరుద్ధమని, కలెక్టర్ , పోలీస్ విభాగం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని వారు ఆరోపించారు. ఎప్పుడు ఎన్నిక నిర్వహించినా గెలిచేది తామేనని ధీమా వ్యక్తం చేశారు.