Indiramma Houses: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకం లబ్ధిదారులకు గృహనిర్మాణ శాఖ కీలక షాక్ ఇచ్చింది. సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకునే పేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం సద్వినియోగం కావాలనే ఉద్దేశంతో కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ముఖ్యంగా, అనుమతించిన ప్లాన్కు మించి స్లాబ్ విస్తీర్ణాన్ని పెంచే వారిపై గట్టి నియంత్రణ విధించింది. ఇకపై నిబంధనలు అతిక్రమించి పెద్ద సైజుల్లో స్లాబులు వేస్తే ప్రభుత్వ నిధుల విడుదల నిలిచిపోతుందని స్పష్టం చేసింది. ఈ కొత్త రూల్స్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఇళ్లకు కూడా వర్తిస్తాయని గృహనిర్మాణ శాఖ కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అప్పుల బారిన పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం
క్షేత్రస్థాయిలో చాలా మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో గోడల కంటే 3 నుంచి 8 అడుగుల వరకు స్లాబ్ను ముందుకు పొడిగిస్తూ భారీగా ఖర్చు పెంచుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షల రూపాయల సాయం సరిపోక, మిగిలిన మొత్తానికి పేదలు అప్పుల బారిన పడుతున్నారు. మరికొందరు ఆర్థిక భారం తట్టుకోలేక ఇళ్ల నిర్మాణాలను మధ్యలోనే వదిలేస్తున్నారు. ఈ ఇబ్బందులను అరికట్టి, ప్రభుత్వ సాయంతోనే ఇళ్లు పూర్తిగా పూర్తి కావాలనే ఆందోళనతో అధికారులు స్లాబ్ వైశాల్యంపై పరిమితులు విధించారు.
కొత్త కొలతలు , నిబంధనలు ఇవే
ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. 400 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా కలిగిన ఇంటికి స్లాబ్ వైశాల్యం గరిష్టంగా 500 చదరపు అడుగుల లోపు మాత్రమే ఉండాలి. అలాగే, 600 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా కలిగిన ఇంటికి స్లాబ్ గరిష్టంగా 750 చదరపు అడుగుల వరకే పరిమితం కావాలి. ఇంటి ముందు వైపు స్లాబ్ పొడిగింపును గరిష్టంగా 3 అడుగులకే పరిమితం చేయాలని, మిగిలిన మూడు వైపులా కేవలం ఒక అడుగు మాత్రమే పొడిగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రత్యామ్నాయాలపై అవగాహన కల్పించాలి
భారీ ఆర్సీసీ స్లాబుల పొడిగింపునకు బదులుగా, కిటికీలు , తలుపులపై సాధారణ సన్షేడ్లు లేదా సజ్జాలను ఏర్పాటు చేసుకోవాలని లబ్ధిదారులకు ప్రభుత్వం సూచించింది. అలాగే, ఇంటి ముందు నీడ కోసం కాంక్రీట్ స్లాబ్ను వాడకుండా తక్కువ ఖర్చుతో కూడిన జి.ఐ షీట్లను ఉపయోగించాలని స్పష్టం చేసింది. ఈ సరికొత్త నిబంధనలపై క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు పూర్తి అవగాహన కల్పించాలని, ఎక్కడా ఉల్లంఘనలు జరగకుండా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లను, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

