Site icon NTV Telugu

Ibrahimpatnam Drama: గెలిచినా దక్కని చైర్మన్ పదవి.! హైకోర్టు స్టేతో నిలిచిన ఇబ్రహీంపట్నం ఎన్నికల ఫలితం.!

Ibrahimpatnam

Ibrahimpatnam

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం మలుపుల మీద మలుపులు తిరుగుతూ చివరకు హైకోర్టు మెట్లెక్కింది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, ఒక కౌన్సిలర్‌ను కిడ్నాప్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఈ ఎన్నికపై కీలకమైన స్టే విధించింది. బుధవారం (ఫిబ్రవరి 18) ఉదయం దీనిపై తుది విచారణ జరగనుంది. ఈ వివాదం వెనుక ఉన్న ప్రధాన కారణం బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి అదృశ్యం కావడం. ఆయనను ప్రత్యర్థులు కిడ్నాప్ చేశారని, బలవంతంగా ఓటింగ్‌కు దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారని ఆయన కుమారుడు హరికృష్ణ దాఖలు చేసిన ‘హేబియస్ కార్పస్’ పిటిషన్‌పై ధర్మాసనం అత్యవసర విచారణ చేపట్టింది.

Raghav Chadha Speech: ఎయిర్‌లైన్స్ దోపిడీపై రాఘవ్ చద్దా ఫైర్.. పార్లమెంటులో అడిగిన ఆ ఒక్క ప్రశ్న వైరల్..

విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్రంగా స్పందిస్తూ, రేపు ఉదయం 10:30 గంటలకు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని స్వయంగా తమ బెంచ్ ముందు హాజరుపర్చాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో న్యాయస్థానానికి సాంకేతిక , చట్టపరమైన సహాయం అందించేందుకు సీనియర్ న్యాయవాది రామకృష్ణారెడ్డిని ‘అమికస్ క్యూరీ’గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ దాదాపు పూర్తయి, చైర్మన్ అభ్యర్థిగా టేకు సుదర్శన్ రెడ్డి ఎన్నికైనట్లు ప్రచారం జరుగుతున్న సమయంలోనే కోర్టు నుంచి స్టే ఉత్తర్వులు రావడంతో అధికారులు గెలుపు ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేయకుండా నిలిపివేశారు. దీంతో మున్సిపల్ కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్ , కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని హైటెన్షన్ నెలకొంది.

ప్రస్తుతానికి ఈ ఎన్నిక భవితవ్యం రేపు ఉదయం జరగబోయే విచారణపైనే ఆధారపడి ఉంది. మరో లంచ్ మోషన్ పిటిషన్ ద్వారా దాఖలైన ఈ కేసులో కౌన్సిలర్ యాదగిరి స్వయంగా కోర్టుకు హాజరై ఇచ్చే స్టేట్‌మెంట్ అత్యంత కీలకం కానుంది. ఆయన తన ఇష్టపూర్వకంగానే వెళ్లారా లేదా ఎవరైనా ఒత్తిడి చేశారా అన్న అంశంపై స్పష్టత వస్తేనే ఈ ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ వీడనుంది. పోలీసులు ఇప్పటికే కౌన్సిలర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రేపటి విచారణలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Bhupen Borah: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకి మాజీ పీసీసీ చీఫ్..

Exit mobile version