హైదరాబాద్ వ్యాప్తంగా వార్తల్లో నిలిచిన ‘హైడ్రా’ కమిషనర్, ఐపీఎస్ అధికారి ఏ.వి. రంగనాథ్కు తెలంగాణ హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. వరుస కోర్టు ధిక్కరణ కేసులపై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రంగనాథ్ను వెంటనే హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని ఆదేశించింది. అంతేకాకుండా, ఆయన స్థానంలో మరో అధికారిని నియమించాలని ప్రభుత్వానికి సూచించింది.
లోతుకుంట భూముల వివాదం.. కోర్టు ఆగ్రహం
సికింద్రాబాద్ సమీపంలోని లోతుకుంట సర్వే నెంబర్లు 1, 2 పరిధిలో ఉన్న 40 ఎకరాల భూములకు సంబంధించి ‘శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్’ వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు తమ భూముల్లోకి వచ్చి జోక్యం చేసుకుంటున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. ఏకంగా 63 కోర్టు ధిక్కరణ కేసులు ఒక్క అధికారిపైనే ఉండటం ఏంటని ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులను పదే పదే లెక్కచేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది.
కోర్టుకు క్షమాపణలు చెప్పిన రంగనాథ్
హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టులో అఫిడవిట్ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన న్యాయస్థానానికి క్షమాపణలు తెలుపుతూ.. తనకు కోర్టుల అన్నా, న్యాయ వ్యవస్థ అన్నా ఎంతో నమ్మకం, గౌరవం ఉన్నాయని పేర్కొన్నారు. లోతుకుంటలోని ఆ 40 ఎకరాల స్థలంలోకి హైడ్రా సిబ్బంది అసలు వెళ్లలేదని, పిటిషనర్ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని రంగనాథ్ తన అఫిడవిట్లో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే, కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనల తీరుపై తీవ్రంగా ఉన్న హైకోర్టు, ఆయనను బాధ్యతల నుంచి తొలగించాల్సిందేనని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

