తెలంగాణ రాజకీయం హస్తినలో చేరింది. ఢిల్లీలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ల్యాండ్ అయ్యారు. అయితే అందరూ కలిసిమెలసి ఢిల్లీకి వెళ్లారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.. ఢిల్లీకి వెళ్లేందుకు ఒక్కొక్కరి ఒక్కో ప్రాబ్లెం.. కాంగ్రెస్ విషయానికి వస్తే.. తెలంగాణ కాంగ్రెస్కు తలనొప్పిగా మారిన జగ్గారెడ్డి ఎపిసోడ్, తదితర అంశాల గురించి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇచాంర్జీ మాణిక్కం ఠాగూర్తో మాట్లాడేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెళ్లారు. అధిష్టానం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, భట్టిలు ఢిల్లీ చేరుకున్నారు.
ఇదిలా ఉంటే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు గులాబీ నేతలు హస్తినకు వెళ్లారు. ఇప్పటికే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకోగా, మరికొందరు టీఆర్ఎస్ నేతలు సాయంత్రం హస్తినలో అడుగుపెట్టనున్నారు. వీరితో పాటు తెలంగాణ బీజేపీ నేతలు సైతం ఢిల్లీలోనే ఉన్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండిసంజయ్ ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ వ్యూహాలకు కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తానికి తెలంగాణ రాజకీయంతో ఢిల్లీ దద్దరిల్లుతుందా చూడాలి మరి.
