ప్రపంచ సుందరి కిరీటాన్ని థాయ్లాండ్ భామ ఒపాల్ సుచతా చువాంగ్శ్రీ సొంతం చేసుకుంది. మిస్ వరల్డ్ 72వ విజేతగా ఒపాల్ సుచతా చువాంగ్శ్రీ నిలిచింది. ఒపాల్ సుచతా చువాంగ్శ్రీకి మిస్ వరల్డ్ కిరీటాన్ని సీఎం రేవంత్ రెడ్డి, జూలియా మోర్లీ, క్రిస్టినా పిజ్కోవా అలంకరించారు. ఇక రన్నరప్గా ఇథియోపియా భామ నిలిచింది. మూడో స్థానంలో పోలెండ్, నాల్గో స్థానంలో మార్టినిక్ భామ నిలిచింది.
సుచతా బ్యాగ్రౌండ్ ఇదే..
ఒపాల్ సుచతా చువాంగ్శ్రీ.. 20, సెప్టెంబర్ 2003న థాయ్లాండ్లో జన్మించింది. థానెట్ డోంకామ్నెర్డ్, సుపాత్ర చువాంగ్ర్సీ దంపతుల కుమార్తె. ఫుకెట్లోని తలాంగ్లో ఒక ప్రైవేట్ వ్యాపారాన్ని నడిపిస్తోంది. ప్రస్తుతం ఆమె థమ్మసాట్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసిస్తోంది. ప్రపంచ సుందరి విజేతగా తొలి థాయ్లాండ్ మహిళగా రికార్డ్ సృష్టించింది. గతంలో మిస్ యూనివర్స్ థాయ్లాండ్ 2024 కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఇక మిస్ యూనివర్స్ 2024 పోటీలకు థాయ్లాండ్ ప్రాతినిధ్య వహించింది. అప్పుడు మూడో రన్నరప్గా సుచతా నిలిచింది.
16 ఏళ్ల వయస్సులోనే సుచతా క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడింది. థాయ్లాండ్లో రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పిస్తోంది. క్యాన్సర్ బాధితులకు అండగా ఉండేందుకు నిధుల సేకరించడంతో పాటు, కొన్ని సంస్థలతో కలిసి పని చేస్తున్నారు.
ప్రపంచ సుందరి 2025 కిరీటాన్ని సొంతం చేసుకునేందుకు మొత్తం 108 దేశాల అందాల భామలు పోటీలో పాల్గొన్నారు. ఇందులో 16 మంది క్వార్టర్స్కు ఎంపికయ్యారు. చివరి రౌండ్లో అమెరికా-కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా-ఓషియానా ఖండాల నుంచి విజేతను ఎంపిక చేస్తారు. ఫైనల్కు వచ్చిన నలుగురిలో తుది ప్రశ్న ద్వారా న్యాయనిర్ణేతలు మిస్ వరల్డ్ విజేతను ప్రకటించారు. మొత్తానికి థాయ్లాండ్ భామ ఒపాల్ సుచతా చువాంగ్శ్రీ కిరీటాన్ని కైవసం చేసుకుంది. మిస్ వరల్డ్ విజేతకు రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ అందజేశారు. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్, మెయిన్ స్పాన్సర్ల ద్వారా ఈ ప్రైజ్ మనీ అందించారు.
ప్రపంచ సుందరి-2025 ఫైనల్ పోటీలు హైదరాబాద్లోని హైటెక్స్లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దంపతులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, టాలీవుడ్, బాలీవుడ్, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. మొత్తం 3,500 మంది అతిథులు హాజరైనట్లు తెలుస్తోంది. ఇక న్యాయ నిర్ణేతలుగా నటుడు సోనూ సూద్, మేఘా ఇంజనీరింగ్ గ్రూప్ డైరెక్టర్ సుధారెడ్డి, 2017 మిస్ వరల్డ్ విజేత మానుషి చిల్లార్ ఉన్నారు.