సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ ఆఫీసులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ కార్యాలయంలోని 3వ అంతస్థులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే కార్యాలయం కిందకు పరుగులు పెట్టారు. అంతేకాకుండా 5వ అంతస్థులోని సిబ్బంది భయంతో ఆఫీస్ టెర్రస్పైకి ఎక్కారు. వీరితో పాటు ఓ ఇద్దరు ఉద్యోగులు ప్రమాదం జరిగిన సమయంలో ఆఫీస్ లిఫ్ట్లో చిక్కుకున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.
అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. టెర్రస్పైకి ఎక్కిన ఉద్యోగులను క్రేన్ సాయంతో కిందకు దించారు. లిఫ్ట్ ఇరుక్కుపోయిన ఇద్దరు ఉద్యోగులను కూడా సురక్షింతగా కాపాడారు. ఈ ప్రమాదంలో 3వ అంతస్థులో ఉన్న ఫైల్స్ అన్ని అగ్నికి ఆహుతయ్యాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.