భారత్లో కరోనా వైరస్ కల్లోలమే సృష్టిస్తోంది.. అయితే, కేంద్ర ప్రభుత్వం కరోనాను అరికట్టడంలో ఘోరంగా విఫలమైంది అని మండిపడ్డారు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ.. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశ ప్రధాని మోడీకి ముందుచూపు లేకపోవటం వల్లే కరోనా వైరస్ విజృంభించిందని విమర్శించారు.. దేశంలో కరోనాతో ప్రస్తుత పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయని.. ఇప్పటికైనా మహమ్మారి కట్టడికోసం చర్య తీసుకోవాలన్నారు.. తెలంగాణలో కూడా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు ఒవైసీ.. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన ఆయన.. హైదరాబాద్ లో నూతనంగా ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు..
ఇక, ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా రోగుల వల్ల బెడ్లు నిండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు ఒవైసీ… ఈ పాటికి ఉస్మానియా ఆస్పత్రి నిర్మిస్తే కనీసం ప్రజలకి, రోగులకు వైద్యసేవలు అందించడానికి వెసులుబాటు కలిగేదని.. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు.. ఈ విషయంలో అనవసరంగా ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లాయన్నారు.. కరోనాను కట్టడి చేయడంలో ప్రజల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మెరుగైన నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.. మరోవైపు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి ప్రతి ఒక్కరూ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు.