ఉమ్మడి పాలమూరు జిల్లా నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణం వల్ల రైతులకు ఒరిగేదేమీ లేదని, కేవలం కమిషన్ల కక్కుర్తి కోసమే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తెస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ధర్నా చేస్తున్న రైతులతో భేటీ అయిన ఆయన, ఈ పోరాటం రాజకీయాల కోసం చేస్తున్నది కాదని, రైతుల భూములను కాపాడుకోవడానికి చేస్తున్న ఆత్మాభిమాన పోరాటమని పేర్కొన్నారు.
Summer Tips: చీమల బెడద భరించలేకపోతున్నారా? ఈ సింపుల్ ట్రిక్స్తో చెక్ పెట్టండి!
గత అరవై ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 25 రిజర్వాయర్లు మాత్రమే కడితే, బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో 65 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లను నిర్మించిందని హరీష్ రావు గుర్తు చేశారు. “పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మేజర్ పనులు మేమే పూర్తి చేశాం. కానీ మిగిలిపోయిన చిన్న చిన్న పనులు పూర్తి చేయడం ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదు. మూడు సీజన్లు వృథా చేసి 50 టీఎంసీల నీటిని నిలుపుకునే అవకాశాన్ని చేజార్చారు” అని ఆయన మండిపడ్డారు. నాడు అనేక కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలకు నేడు కాలువలు తవ్వడం కూడా సాధ్యపడటం లేదని ఎద్దేవా చేశారు.
గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ గురించి మాట్లాడుతూ.. ఏదుల నుండే నీళ్లు పారే అవకాశం ఉన్నప్పుడు ఈ కొత్త రిజర్వాయర్ అవసరమే లేదని తాము ఆనాడే చెప్పామన్నారు. కేఎల్ఐ (KLI) పథకంలో మొదట వనపర్తి లేకపోయినా, నిరంజన్ రెడ్డి పట్టుబట్టి నీళ్లు ఇప్పించారని తెలిపారు. జూరాల వద్దే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కట్టాల్సిందని ఇప్పుడు మాట్లాడుతున్న వారు బుద్ధి ఉన్నవారెవరూ ఆ మాట అనరని, శ్రీశైలం నుండి రోజుకు రెండు టీఎంసీలు తీసుకునేలా తాము అద్భుతమైన డిజైన్ చేశామని వివరించారు.
Summer Tips: చీమల బెడద భరించలేకపోతున్నారా? ఈ సింపుల్ ట్రిక్స్తో చెక్ పెట్టండి!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “కేరళ వెళ్ళి ఆరు గ్యారెంటీలు అమలు చేశామని అబద్ధాలు చెబుతున్నారు. ఇక్కడ నాలుగు రైతుబంధులను ఎగ్గొట్టి, రుణమాఫీని అసంపూర్తిగా వదిలేశారు. వనపర్తిలో ఏ ఊరికైనా వెళ్దాం.. రుణమాఫీ 100 శాతం పూర్తయిందని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తాను. ఒకవేళ కాకపోతే నువ్వు రాజీనామా చేస్తావా?” అని సీఎంకు బహిరంగ సవాల్ విసిరారు. వంద రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తామని సంతకం పెట్టి, రెండున్నర ఏళ్లు దాటినా ఇంకా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రైతుల భూములను కాపాడటానికి తాము ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
