Hanamkonda Protest: హనుమకొండ కలెక్టరేట్ ప్రాంగణం గురువారం ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం టీఎన్జీవోలు చేపట్టిన ధర్నా ఆందోళనలో బీఆర్ఎస్ అగ్రనేతలు పాలుపంచుకుని ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో ధర్నా ముగిసిన అనంతరం కలెక్టరేట్ నుండి పాలిటెక్నిక్ కాలేజీ వైపు బయలుదేరిన మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఉద్యోగులకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు
ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు , మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొని ఉద్యోగ వర్గాలకు అండగా ఉంటామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లన్నిటికీ బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడిన హరీశ్ రావు కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టారు.
కమిషన్లు ఇస్తేనే రిటైర్మెంట్ బెనిఫిట్స్.. హరీశ్ రావు సంచలన ఆరోపణలు
రేవంత్ రెడ్డి పాలనపై హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందాలంటే 15 శాతం కమిషన్లు ఇచ్చుకోవాల్సిన దారుణమైన పరిస్థితి నెలకొందని ఆయన ఆరోపించారు. ఉద్యోగులకు వెంటనే మెరుగైన పీఆర్సీ (PRC) ప్రకటించాలని, అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ఆలస్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘ప్రజా పాలన’ అని చెప్పుకుంటున్న ఈ సర్కారులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలవడానికి వెళ్తే కనీసం సెల్ ఫోన్ను కూడా అనుమతించడం లేదని మండిపడ్డారు.
బెదిరింపులకు ఉద్యోగులు లొంగరు
రాష్ట్రంలో రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు , విద్యార్థులు ప్రతి ఒక్కరూ తమ హక్కుల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందని, అయినా సర్కారుకు చలనం లేదని విమర్శించారు. ఉద్యోగ సంఘాల నాయకులను బెదిరించేందుకు ఏసీబీ, విజిలెన్స్ కేసులను అస్త్రాలుగా వాడుతూ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి కొందరు నాయకులను బెదిరించవచ్చేమో కానీ, లక్షలాది మంది ఉన్న ఉద్యోగుల పవర్ ముందు ఈ బెదిరింపులు సాగవని హెచ్చరించారు.
అసెంబ్లీలో సర్కారును నిలదీస్తాం
ఉద్యోగులతో పెట్టుకుని ఎవరూ సంతోషంగా ఉన్న చరిత్ర లేదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా రోజులు దగ్గర పడ్డాయని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగుల గొంతుకగా మారి బీఆర్ఎస్ తరఫున ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని, ఉద్యోగుల డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు.

