తెలంగాణ గవర్నర్ తమిళిసై సైతం ఇప్పటికే ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇటీవలె వరద బాధితుల్ని పరామర్శించారు ఆమె. ఆదివాసీ మహిళ అత్యున్నత పీఠం అధిరోహించడం చారిత్రాత్మకం అంటూ ప్రసంశించారు. నామినేషన్ రోజు వరదల కారణంగా ఢిల్లీ వెళ్లలేకపోయా అంటూ తెలిపారు. వరదలు వచ్చాయి కాబట్టే ప్రభావిత ప్రాంతాల్లో తిరగానని అన్నారు. రాష్ట్రానికి ప్రథమ పౌరురాలిని కాబట్టే ప్రజల దగ్గరికి వెళ్లానని అన్నారు. అందుకే ఆదివాసీలు ఉన్న భద్రాచలం ఏరియాకు వెళ్లా అంటూ గవర్నర్ తెలిపారు. వర్షాలపై కేంద్ర హోంశాఖకు రిపోర్టు ఇచ్చా అన్నారు.
సోమవారం ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన తమిళిసై కేంద్ర రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తున్నారని అన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను చూసి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశంలో ఉండిఉంటారు కానీ, ముందస్తుకు వెళ్తారని తాను అనుకోవడం లేదని చెప్పారు. అయితే.. ఇటీవల రాజ్ భవన్లో తనతో కేసీఆర్ భేటీ తర్వాత కూడా ప్రోటోకాల్లో తేడా ఏమీ లేదని అన్నారు. ఈనేపథ్యంలో.. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని చెప్పారు. తాను ప్రోటోకాల్ అడగడం మానేశానని, ఇటీవల వరద ముంపు ప్రాంతాల్లో తాను పర్యటిస్తుంటే ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం కలెక్టర్ రావాల్సి ఉన్నా ఆయన రాలేదని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో వరదలు సంభవించినప్పుడు ఆ రాష్ట్ర గవర్నర్లు ఇలా పర్యటనలు చేయలేదుగా అనే ప్రశ్నకు తాను వేరే గవర్నర్లతో పోల్చుకోవద్దని చెప్పారు.
తెలంగాణ గవర్నర్ అయినంత మాత్రాన తాను రాజ్ భవన్కే పరిమితం కాలేనని, ప్రజలకు దగ్గరగా ఉండటమే తన లక్ష్యమని చెప్పారు. ప్రజలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి అడుగుతున్నారని అన్నారు. వానలతో నిరాశ్రేయులైన వరద బాధితులకు తోచిన రీతిలో ఎన్జీవోల ద్వారా దుస్తులు అందించానని చెప్పారు గవర్నర్. కేంద్ర ప్రభుత్వం తప్పకుండా రాష్ట్రానికి సహాయం చేస్తుందని అన్నారు. ఈనేపథ్యంలోనే.. గతంలో వరదలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం సహాయం చేసిందని, వరదల కారణంగా ఎంత నష్టం ఏర్పడిందో ఆ వివరాలను మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని వివరించారు.