హైదరాబాద్లోని ప్రముఖ ఐటీ సంస్థ ‘అక్యూబ్ బిజినెస్ అండ్ టెక్నాలజీస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ (Acupe Business and Technologies Solutions Pvt Ltd) కంపెనీని నమ్మి పనిచేసిన మాజీ ఉద్యోగి ఒకరు ఏకంగా రూ. 1.64 కోట్ల మేర భారీ మోసానికి పాల్పడ్డాడు. కంపెనీ భాగస్వామ్య సంస్థలకు చెందిన క్రెడిట్ కార్డు వివరాలను అక్రమంగా కాజేసి, వాటి ద్వారా వందలాది లావాదేవీలు జరిపినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మోసంపై కంపెనీ డైరెక్టర్ చెరుకు అనిరుధ్ రెడ్డి హైదరాబాద్ సైబర్ క్రైమ్/సీసీఎస్ (CCS) పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉద్యోగం తీసేసిన కొద్దిరోజులకే దందా.. అసలేం జరిగింది?
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రిషబ్ జగ్గీ అనే వ్యక్తి 2025 జనవరిలో ‘అక్యూబ్ బిజినెస్’ కంపెనీలో టికెటింగ్ ఏజెంట్గా ఉద్యోగంలో చేరాడు. అయితే అతని పనితీరు సంతృప్తికరంగా లేకపోవడంతో మార్చి నెలలోనే కంపెనీ యాజమాన్యం అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. కంపెనీ నుంచి బయటకు వచ్చిన కొద్దిరోజులకే రిషబ్ సొంతంగా ఒక ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించాడు. ఈ క్రమంలో కంపెనీలో పనిచేసే సమయంలో సంపాదించిన భాగస్వామ్య సంస్థల సీనియర్ ప్రతినిధుల 9 క్రెడిట్ కార్డుల సమాచారాన్ని, రహస్య వివరాలను అక్రమంగా వినియోగించడం మొదలుపెట్టాడు.
386 లావాదేవీలు.. రూ.1.64 కోట్ల నష్టం
సొంత ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్న రిషబ్, ఆ నకిలీ క్రెడిట్ కార్డు వివరాలతో ఏకంగా 386 మోసపూరిత లావాదేవీలు జరిపాడు. వీటి ద్వారా 70కి పైగా ఖరీదైన విమాన టికెట్లు బుక్ చేసి, దాదాపు రూ. 1,64,00,000 (కోటి అరవై నాలుగు లక్షలు) మేర కంపెనీకి నిధుల నష్టం చేకూర్చాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడు రిషబ్ జగ్గీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు, దర్యాప్తును తీవ్రతరం చేసి అతడి కోసం గాలిస్తున్నారు.

