పచ్చటి సంసారంలో సైతం కేసీఆర్ చిచ్చు పెడతారని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్… హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని కొత్తపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ లేని పద్ధతుల్లో ఇక్కడ పుడితే టీఆర్ఎస్లోనే ఉండాలి అని బెదిరిస్తున్నారని మండిపడ్డారు.. ఉద్యోగాలు పీకేస్తాం అని, పెన్షన్, కళ్యాణ లక్ష్మీ రాకుండా చేస్తామని అంటున్నారట.. ఆపడం ఎవరికీ సాధ్యం కాదని హెచ్చరించారు. వీటికి ఇచ్చే డబ్బులు అన్నీ ప్రజలు కట్టే పన్నులేనని గుర్తుచేసిన ఆయన.. సీసాల మీద సంవత్సరానికి 30 వేల కోట్లు, రోజుకు 90 కోట్లు కడుతున్నాం అన్నారు. మనకు ఇచ్చేది పెన్షన్లకు 9 వేల కోట్లు, కళ్యాణ లక్ష్మికి 1500 కోట్లు ఖర్చు అవుతాయి… ఏవీ పుక్కట్కి ఇవ్వడంలేదని ఫైర్ అయ్యారు.
పెన్షలు చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి అప్పుడే ఉన్నాయి.. డబ్బులు అందరికీ వచ్చాయన్నారు ఈటల రాజేందర్.. నేను ఉన్నంత వరకు మీ పెన్షన్, రేషన్ కార్డ్, కళ్యాణ లక్ష్మి, దళిత బంధు, రైతు బంధు ఆగదన్నారు.. ఈటల రాజేందర్ ఓడిపోతే 20 ఏళ్లు వాళ్ల కుటుంబపాలన సాగుతుంది అని అనుకుంటున్నారు. దసరాకి మందు, మాంసం ఇచ్చారు.. ఓటుకు లక్ష ఇవ్వమని అడగండి అంటూ సూచించారు.. ఎంత ఇచ్చినా తీసుకోండి.. దళిత బంధు, పావలా వడ్డీ చెక్కులు, రోడ్డు, ఓటుకు డబ్బులు నా వల్ల వస్తున్నాయి.. తీసుకోండి.. కానీ, నన్ను మర్చిపోకండి. లిక్కర్ సీసాల వెనుక, దళిత బంధు వెనుక ఒక కత్తి ఇచ్చి పంపిస్తున్నారు. దానిని పెట్టి నన్ను పొడిచి రాజకీయంగా చంపాలని పంపిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలన్నారు.. మీకు నేను పేరు తెచ్చిన గౌరవం పెంచిన.. దానిని చెరిపే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సారి కులాలు, మతాలు కావు.. కెసిఆర్ డబ్బులు, సీసాలు, అహంకారం పేదల బ్రతుకుల మధ్య పోటీ అన్నారు ఈటల రాజేందర్.