మహబుబాబాద్ జిల్లాలో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ చేపట్టిన ఒక రోజు ఉక్కు దీక్ష విరమణలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. 70 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ సిగ్గులేకుండా జనంలో తిరుగుతుందని ఆయన విమర్శించారు. విశాఖ ఉక్కు కంటే బయ్యారం ఉక్కు నాణ్యమైనదని ఆయన వెల్లడించారు. బండి సంజయ్ గుండు పై ఇనుప గుండ్లు పెడుతామని ఆయన అన్నారు. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. బీజేపీ ఎంపీలు రాజీనామా చేయండి లేకపోతే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయించండి అని ఆయన సవాల్ విసిరారు. బీజేపీ తెలంగాణకు చేసింది ఏమి లేదని, బయ్యారం ఉక్కు లేదు, కోచ్ ఫ్యాక్టరీ లేదు, గిరిజన యూనివర్సిటీ లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు.
బీఎస్ఎన్ఎల్, రైల్వే, ఇండియన్ ఎయిర్లైన్స్ అన్నింటినీ బీజేపీ ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తున్నారని ఆయన ఆరోపించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సవరణ చేయాలని కేసీఆర్ అన్నారని, అందులో తప్పు ఏమిలేదు, రాష్ట్ర లకు అధికారులు ఇవ్వాలనడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. కులాల మధ్య, మతాల మధ్య బీజేపీ చిచ్చు పెట్టి దేశాన్ని నాశనం చేస్తుందని ఆయన అన్నారు. బీజేపీ ఎంపీలను నిలదీయండి, తెలంగాణ సాధించిన విధంగా మరొక ఉద్యమం చేసి ఉక్కు పరిశ్రమ సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.