డ్రగ్స్ వ్యవహారంపై మళ్లీ ఫోకస్ పెట్టారు తెలంగాణ పోలీసులు.. ఇవాళ డ్రగ్స్ పై డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి జంట నగరాల పోలీస్ కమిషనర్లతో పాటు జిల్లా ఎస్పీలు హాజరయ్యారు.. డ్రగ్స్ నియంత్రణకు 1000 మందితో ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే కాగా.. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు డీజీపీ.. ఇక, సీఎంతో పోలీసులు, ఎక్సైజ్ అధికారులతో హై లెవల్ మీటింగ్ జరగనుంది.. డ్రగ్స్ విక్రేతలు, వాడకందారులపై తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీ సమావేశంలో చర్చ జరిగింది..
ఇక, డీజీపీ నిర్వహించిన సమావేశంలో కీలక ప్రతిపాదనలు సిద్ధం చేశారు.. డ్రగ్స్ అమ్మకందారులు, వినియోగదారుల చిట్టా తయారు చేసింది పోలీసుశాఖ.. గతంలో డ్రగ్స్ తీసుకున్న వాళ్ల పేర్లతో చిట్టా సిద్ధం అయ్యింది.. సినీ , రాజకీయ, వ్యాపార వేత్తలు, విద్యార్థుల సంబంధించిన పేర్లతో చిట్టా సిద్ధం అయినట్టుగా పోలీసులు ఉన్నతాధికారులు చెబుతున్నారు.. డ్రగ్స్ తో పాటుగా గంజాయి తీసుకున్నవారి వివరాలను కూడా పోలీసుశాఖ పొందుపర్చింది.. మరోవైపు డ్రగ్స్ విక్రయాలపై నిరంతర నిఘాకు కొత్త యాప్ను రూపొందించారు.. ఆ యాప్ లో డ్రగ్స్ విక్రయదారుల సంబంధించిన పూర్తి సమాచారంతో అందుబాటులో ఉంచనున్నారు.. డ్రగ్స్ కు సంబంధించి గత పదేళ్లకు సంబంధించిన పూర్తి డేటాను తయారు చేసింది పోలీసుశాఖ.. ఇక, సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశంలో వీటిపై చర్చ సాగనుంది.. కానీ, కేసీఆర్ సమీక్షలో ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.