హుజురాబాద్ ఉప ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషనర్ శ్రీ సుశీల్ చంద్ర ను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్టు ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి శ్రీ దాసోజు శ్రవణ్, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు కుసుమ కుమార్, హర్కర వేణుగోపాల్ తదితర తెలంగాణ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. అడ్డగోలుగా అక్రమాలు, ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తూ హుజురాబాద్లో ఓటర్లను టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కొనుగోలు చేస్తున్నాయని ఆరోపించారు.
ఓటుకు రూ. 6 వేల నుంచి రూ.10 వేల వరకు డబ్బులు ఇచ్చి ఓట్లను కొనుగోలు చేస్తున్నారని ఆధారాలతో ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన తెలిపారు. బహుమతులు, ప్రలోభాలు, ఓట్ల కొనుగోలు, అధికార దుర్వినియోగం తదితర అక్రమాలు జరిగాయని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. మూడు గంటల్లో లక్షన్నర మంది ఓటర్లకు రూ. 90 కోట్ల రూపాయలు పంపిణీ జరిగిందని, ఇంత ఘోరంగా విచ్చలవిడిగా అడ్డగోలు అక్రమాలు, ఎన్నికల నిబంధనల అతిక్రమణలు ఎక్కడా జరగలేదని ఆరోపణలతో ఫిర్యాదు చేయనున్నట్టు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.