కోవిడ్ వ్యాక్సినేషన్లో తెలంగాణ మరో మైలురాయిని దాటింది. రాష్ట్రంలో కొవిడ్ టీకాల పంపిణీ 5 కోట్ల డోసులు పూర్తయింది. వైద్యసిబ్బంది కేవలం 35 రోజుల్లోనే కోటి టీకాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో గురువారం నాటికి మొదటి డోస్ 2.93 కోట్లు, రెండో డోస్ 2.06 కోట్లు, ప్రికాషన్ డోస్ మరియు బూస్టర్ డోస్ 1.13 లక్షల డోసులు పంపిణీ చేశారు. 15-17 ఏళ్ల వారికి 8.67 లక్షల డోసులు (47%) వేశారు. మొదటిడోస్ లక్ష్యానికి మించి దాదాపు 103 శాతం మందికి పంపిణీ చేయగా, రెండో డోస్ 74 శాతం మందికి వేసినట్టు వైద్యాధికారులు తెలిపారు.
Read Also: మా సుపరిపాలన-సుస్థిరతే బీజేపీకి సమాధానం: కేటీఆర్
వైద్య సిబ్బందికి మంత్రి హరీశ్రావు అభినందనలు
టీకాల పంపిణీ 5 కోట్ల డోసులు దాటిన సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఉండి నిరంతరం వ్యాక్సినేషన్లో కృషి చేస్తున్న వైద్యసిబ్బందితోపాటు పంచాయతీ, మున్సిపల్, ఇతర శాఖల సిబ్బందిని అభినందించారు. వైద్యసిబ్బంది కృషితో ఇప్పటికే వ్యాక్సినేషన్ మొదటి డోస్ 100 శాతం పూర్తి చేసుకున్న తొలి పెద్ద రాష్ట్రంగా తెలంగాణ రికార్డు నెలకొల్పిన విషయాన్ని గుర్తు చేశారు. టీకాలు, కోవిడ్ జాగ్రత్తలు మాత్రమే మనల్ని కరోనా నుంచి కాపాడుతాయన్నారు. ప్రతి ఒక్కరూ రెండు డోసుల టీకాలు వేసుకోవాలని, ప్రభుత్వానికి సహకరించాలని, మాస్కు విధిగా ధరించాలని మంత్రి హరీష్ రావు తెలిపారు.
