
హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ మెట్రోను ఏర్పాటు చేశారు. ఈ మెట్రో రైళ్లు ప్రారంభం తరువాత ప్రతి రోజు కనీసం రెండు లక్షల మంది వరకు ప్రయాణం చేసేవారు. అయితే, మొదటి దశ కరోనా సమయంలో మెట్రో రైళ్లు మూతపడ్డాయి. ఆ తరువాత తిరిగి మెట్రో ప్రారంభమైనా చాలా కాలం వరకు పెద్దగా ప్రయాణికులు లేకపోవడంతో మెట్రో సర్వీసులు తగ్గించుకుంటూ వచ్చారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడుతున్న సమయంలో మళ్ళీ సర్వీసులు పెరిగాయి.
కాగా, ఇప్పుడు రెండో దశ కరోనా మహమ్మారి విజృంభణతో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మెట్రోలో ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు ఆలోచిస్తున్నారు. మెట్రో ఏసీ బోగీలు కావడంతో కరోనా వ్యాప్తి అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కరోనా నిబంధనలు అమలు చేస్తూనే ప్రస్తుతానికి మెట్రో నడుపుతున్నారు. ఇక ఎంజీబిఎస్ నుంచి జేబీఎస్ వరకు నడిపే మెట్రో రైళ్లలో ఆక్యుపెన్సీ దారుణంగా పడిపోయింది. ఈ మార్గంలో ప్రయాణికులు లేకుండానే మెట్రో రైళ్లు తిరుగుతున్నాయి. కరోనా కారణంగా కోట్లాది రూపాయల నష్టం వస్తున్నట్టు మెట్రో నిర్వాహకులు పేర్కొంటున్నారు.