దళిత బంధుతో దళితులను దగా చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గీతారెడ్డి.. కేసీఆర్ దళితుల గురించి ఎన్నో చెప్పారు.. దళితులని సీఎం చేస్తా అన్నారు.. లేదంటే తల నరుక్కుంటా అన్నారన్న ఆమె.. డిప్యూటీ సీఎం రాజ్యను ఎందుకు కేబినెట్ నుంచి తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు.. సబ్ ప్లాన్ ఫండ్స్ కోసం ఏడేళ్లుగా రూ.85,913 కోట్లు కేటాయించారు.. కానీ, ఏడేళ్లలో ఖర్చు చేసింది మాత్రం రూ.47,685 కోట్లు మాత్రమే.. మిగతా రూ.38 వేల కోట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. వాటిని ఎక్కడ వాడారో చెప్పాలని డిమాండ్ చేశారు గీతారెడ్డి.
సబ్ ప్లాన్ అమలుకోసం నోడల్ కమిటీ, స్టేట్ కమిటీ, అపెక్స్ కౌన్సిల్ సమావేశం కూడా పెట్టని వ్యక్తి కేసీఆర్ అంటూ మండిపడ్డారు గీతారెడ్డి.. కేటాయించిన డబ్బులే ఖర్చు చేయని కేసీఆర్.. ఇప్పుడు ఇంటికి రూ. 10 లక్షలు ఇస్తారా..? అని ప్రశ్నించారు. లోన్ల కోసం 5.33 లక్షల మంది దరఖాస్తు చేస్తే.. అందులో 1.16 లక్షల మందికి మాత్రమే లోన్లు ఇచ్చారని గుర్తుచేసిన ఆమె.. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసమే దళిత బంధు తీసుకొచ్చారని విమర్శించారు. మరోవైపు.. దళిత బంధు అంబేద్కర్ విగ్రహానికి ఏడేళ్లుగా కనీసం పూల మాల వేశారా అంటూ కేసీఆర్ను ప్రశ్నించారు గీతారెడ్డి.. ప్రగతి భవన్ లో దళితులను పిలిచి మాత్రం అంబేద్కర్ బొమ్మకి మాత్రం పుల మాల వేశారన్న ఆమె.. దళిత బంధు పథకాన్ని హుజురాబాద్కే పరిమితం చేయొద్దని.. రాష్ట్రంలో ఉన్న దళితుల అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
