CM Revanth Reddy : తెలంగాణ రాజధాని హైదరాబాద్లో అకస్మాత్తుగా మారిన వాతావరణం, కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. నగరంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వరద నీరు నిలిచే చోట్ల తక్షణమే సహాయక చర్యలు చేపట్టేలా సిబ్బందిని రంగంలోకి దించాలని స్పష్టం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ఎవరూ అజాగ్రత్తగా ఉండకూడదని, క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిరంతరం సమీక్షించాలని సీఎం ఆదేశించారు.
నగరంలో సాధారణ జనజీవనానికి, రవాణా వ్యవస్థకు ఆటంకం కలగకుండా ఉండేందుకు వివిధ ప్రభుత్వ విభాగాలు కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్ (GHMC), హైడ్రా (HYDRAA), విద్యుత్ శాఖ, వాటర్ బోర్డ్తో పాటు ఇతర సంబంధిత శాఖలన్నీ పూర్తి సమన్వయంతో రంగంలోకి దిగాలని ఆదేశించారు. రోడ్లపై ట్రాఫిక్ జామ్లను నివారించడం, విరిగిపడిన చెట్లను వెంటనే తొలగించడం, కరెంట్ స్తంభాలు , ఓపెన్ డ్రైనేజీల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని , ప్రభుత్వ సూచనలను పాటించాలని కోరారు.

