Site icon NTV Telugu

డ్రగ్స్ పై పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులతో భేటీ కానున్న సీఎం కేసీఆర్..

cm-kcr

cm-kcr

రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించే లక్ష్యంతో ఈ నెల 20న ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. గుడుంబా నిర్మూలన, పేకాట క్లబ్బుల నిషేధం వంటివి పటిష్టంగా అమలు చేసింది. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల మాఫియా పెచ్చుమీరుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మాదకద్రవ్యాల విక్రయాలు నిరోధించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు సిఎం కేసిఆర్ పోలీస్, ఎక్సైజ్ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోంశాఖ, ఎక్సైజ్ శాఖల ప్రధాన కార్యదర్శులు, డిజీపి మహేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్లు, ఐజిలు, డిఐజిలు, అడీషినల్ డిజి లా అండ్ ఆర్డర్, ఇంటలిజెన్స్ అడీషినల్ డిజి, జిల్లాల ఎస్పీలు, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, జిల్లా సూపరింటెండెంట్లు, రాష్ట్ర మాదకద్రవ్యాల ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధికారులు తదితరులు పాల్గొంటారు.

జిల్లా ఎక్సైజ్ శాఖాధికారులు తమ జిల్లాల పరిధిలో నెలకొన్న పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదికలతో రావాలని సిఎం ఆదేశించారు. రాష్ట్రంలో గుడుంబా, పేకాట నియంత్రణ పటిష్టంగా అమలవుతున్నప్పటికీ అక్కడక్కడా తిరిగి తలెత్తుతున్నట్టు తెలుస్తున్న నేపథ్యంలో తీసుకోవలసిన కఠిన చర్యలపై సమావేశంలో చర్చిస్తారు. మాదకద్రవ్యాల బారిన పడి యువత నిర్వీర్యం కాకూడదనే లక్ష్యంతో రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చేందుకు చేపట్టవలసిన కార్యాచరణను సమావేశం రూపొందిస్తుంది.

Exit mobile version