ముంబై పర్యటనలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. 1969 ఉద్యమ సమయం నుంచి శరద్ పవార్ తెలంగాణకు మద్దతు ప్రకటించారని.. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన తెలంగాణకు మద్దతు ఇస్తూనే ఉన్నారని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అతి చిన్న వయసులోనే సీఎంగా పాలన సాగించిన ఘనత శరద్ పవార్ది అని కొనియాడారు. దేశంలోనే శరద్ పవార్ సీనియర్ నేత అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
దేశం ప్రస్తుతం సరైన మార్గంలో నడవడం లేదని.. దళితుల వికాసం లేదని కేసీఆర్ పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా దేశంలో సరైన పాలన లేకపోవడం దురదృష్టకరమన్నారు. అందుకే దేశం కోసం.. సరైన అజెండా రూపొందించాలన్నారు. దేశంలోనే అత్యంత అనుభవం ఉన్న నేత శరద్ పవార్ అని… ఖచ్చితంగా ఆయన తమతో కలిసి పనిచేస్తా అన్నారని కేసీఆర్ చెప్పారు. ఇంకా ఇతర నేతలతో కూడా మాట్లాడి ముందుకు వెళ్తామని… అందరినీ కలుపుకొని వెళ్తామన్నారు. తమ కార్యచరణ ఏంటో త్వరలోనే తెలియజేస్తామని కేసీఆర్ తెలిపారు.
దేశ రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం పోరాడిందని.. సీఎం కేసీఆర్తో కలిసి పనిచేస్తామని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశాభివృద్ధి గురించే ఎక్కువగా కేసీఆర్తో చర్చించామని.. భవిష్యత్లోనూ కేసీఆర్ను కలిసి ఇంకా చాలా విషయాలు చర్చిస్తామన్నారు.