ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ పై బీఆర్ఎస్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం పై బలపరీక్ష తేదీ దగ్గర పడుతున్న కొద్దీ.. పరిణామాలు వేగంగా మారుతున్నాయి. చైర్మన్ డివీ కి వ్యతిరేకంగా 19 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసి అవిశ్వాస నోటీసు ఇచ్చిన నేపథ్యంలో.. ఫిబ్రవరి 5న ఇల్లెందు మున్సిపల్ ఆఫీసులో ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నోటీసు అందిన వెంటనే ప్రత్యేక క్యాంపుకు తరలిన బీఆర్ఎస్ కౌన్సిలర్లకు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి రకరకాల బెదిరింపులు, ఒత్తిళ్లు వస్తున్నాయి. ఓ పక్క పోలీసులను ఉపయోగించి.. పాత కేసులను తిరగదోడుతూ.. కౌన్సిలర్లు, వారి భర్తలకు పదే పదే ఫోన్లు చేసి పోలీసు స్టేషన్ కు పిలుస్తున్నట్లు కౌన్సిలర్లు వాపోతున్నారు. మరో పక్క తమ కుటుంబ సభ్యుల వ్యాపారాలపై సంబంధిత శాఖల నుంచి నోటీసులు ఇవ్వడం.. సోదాలు చేయించడం ద్వారా ఒత్తిడి పెంచే చర్యలకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు.
విశ్వాస పరీక్షలో చైర్మన్ డివీ కి అనుకూలంగా ఓటు వేయకపోతే.. తరువాత ఇబ్బందులు పడతారని అధికార పార్టీ నేతలు, ముఖ్యుల నుంచి క్యాంపులో ఉన్న కౌన్సిలర్లు, కుటుంబ సభ్యులకు తరచూ ఫోన్లు వస్తున్నాయని చెబుతున్నారు. ఇలాంటి పరిణామాలతో అప్రమత్తమైన బీఆర్ఎస్ పార్టీ.. అవిశ్వాస తీర్మానం పై ప్రత్యేక సమావేశం సజావుగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను కోరింది. ఈ మేరకు క్యాంపులో ఉన్న కౌన్సిలర్ల సంతకాలతో కూడిన లేఖ వారికి అందజేశారు. తమకు పలు రకాల బెదిరింపులు వస్తున్నాయని.. ఫిబ్రవరి 5న సంఘ విద్రోహ శక్తులు.. తమను సమావేశానికి రాకుండా అడ్డుకునే ప్రమాదం ఉందని కౌన్సిలర్లు ఆ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. విశ్వాస పరీక్ష సందర్భంగా తమ పార్టీ నుంచి విప్ జారీ అయినందున తాము ప్రజాస్వామ్యయుతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా తగిన బందోబస్తు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు కలెక్టర్, ఎస్పీలను కోరారు. మొత్తానికి ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ అవిశ్వాస ప్రక్రియ ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు.