మహాత్మా గాంధీ ఏం పాపం చేశారని ఉపాధి హామీ పథకం నుంచి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తొలగించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రశ్నించారు. గురువారం సాయంత్రం చెన్నై నగరంలో ఉపాధి హామీ పథకం నిబంధనలు మార్పు, ఉపాధి పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్ర అనంతరం ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసి ఆ పథకం కనిపించకుండా చేయాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది, ఈ చట్టంలో మహాత్మా గాంధీని పేరు తొలగించడమే కాదు వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ గ్యారంటీ కల్పించాలన్న ఆత్మను సైతం తొలగించారని డిప్యూటీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని కోట్లాదిమంది వ్యవసాయ కార్మికులు ఏం పాపం చేశారని ఉపాధి హామీ పథకంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మార్పులు చేసిందని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. ప్రతి వ్యవసాయ సీజన్లో 50 పైసల కూలీ ధరల పెరుగుదల కోసం దేశవ్యాప్తంగా ఎన్నో ఆందోళనలు, పోలీసు లాఠీచార్జీలు, రక్తపాతం జరిగేవి అని డిప్యూటీ సీఎం వివరించారు.
ఈ దారుణమైన పరిస్థితులను పారద్రోలాలన్న మానవీయకోణంతో యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో దేశంలోని కోట్లాదిమంది వ్యవసాయ కార్మికుల కోసం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని ఈ దేశంలో తీసుకువచ్చారని తెలిపారు. చిన్న రక్తపాతం, ఎలాంటి ఆందోళనలు లేకుండా కూలీలకు 100 రోజుల పని గ్యారంటీ కల్పిస్తూ, ఉపాధి అనేది వ్యవసాయ కార్మికుల హక్కు అని మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు. ఈ పథకం దేశంలోని కోట్లాది వ్యవసాయ కార్మికుల జీవితాల్లో ఒక నిశ్శబ్ద విప్లవం అని వర్ణించారు. ఈ గొప్ప పథకం వ్యవసాయ కార్మికుల జీవితాలకు ఓ అర్థం తీసుకువచ్చింది, ఉన్న ఊరిలోనే సంపాదిస్తూ ఆత్మగౌరవంతో వ్యవసాయ కూలీలు జీవించేందుకు మహాత్మా గాంధీ ఉపాధి పథకం తోడ్పడిందని తెలిపారు. ఇంతటి గొప్ప పథకాన్ని కనుమరుగు చేయాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉపాధి పథకంలో అనేక మార్పులు తీసుకువచ్చింది, చివరకు దేశ ప్రజలు మహాత్మునిగా పిలుచుకునే గాంధీ పేరును సైతం తొలగించిందని తెలిపారు.
ఏ సి సి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ల పిలుపుమేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల పిసిసి కమిటీల ఆధ్వర్యంలో దేశంలోని కోట్లాది వ్యవసాయ కార్మికుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం 2005 ను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించే వరకు వ్యవసాయ కార్మికుల పక్షాన దేశంలోని కోట్లాది కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు వ్యవసాయ కార్మికుల పక్షాన అలుపెరగని పోరాటం చేస్తాయని స్పష్టం చేశారు. సామాన్యునికి ఇబ్బందులు వచ్చినప్పుడు తమిళనాడు ఎల్లప్పుడూ ముందు వరుసలో నిలబడుతుంది ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం తెచ్చిన కొత్త ఉపాధి చట్టంతో వ్యవసాయ కార్మికుల జీవితాల్లో ఇబ్బందులు మొదలయ్యాయి ఇప్పుడు కూడా తమిళనాడు ముందు వరుసలో నిలబడి వ్యవసాయ కార్మికుల పక్షాన నిలబడటం అభినందనీయం అన్నారు. ఈరోజు చెన్నై నగరంలో జరుగుతున్న భారీ ర్యాలీని చూస్తే తనకు కొన్ని విషయాలు గుర్తుకు వస్తున్నాయని వివరించారు. ఈ దేశ స్వతంత్రం కోసం మహాత్మా గాంధీ 1915లో ఆయన తన న్యాయవాద వృత్తిని వదిలి దేశానికి వచ్చారని గుర్తు చేశారు. అధికారం కోసమో? ఇతర వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆయన ఈ దేశానికి రాలేదని తెలిపారు. తన సహచరులతో కలిసి దేశ స్వాతంత్రం కోసం గొప్ప పోరాటం నిర్వహించాలని పట్టుదలతో న్యాయవాద వృత్తిని వదిలేసి దక్షిణ ఆఫ్రికా నుంచి వచ్చారని తెలిపారు.
దారుణమైన బ్రిటిష్ పాలన నుంచి దేశ ప్రజలను విముక్తి కల్పించడానికి మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ, దండి మార్చ్, ఉప్పు సత్యాగ్రహం, సంపూర్ణ స్వరాజ్యం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లో ఆయనతోపాటు అనేకమంది సీనియర్ నాయకులు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. వారి అద్భుతమైన, సాహసోపేతమైన పోరాటం మూలంగా మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించడమే కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన అద్భుతమైన రాజ్యాంగాన్ని రూపొందించుకున్నామని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈరోజు భారతదేశ కీర్తిని పొందింది అంటే బలమైన రాజ్యాంగమే కారణమని తెలిపారు.
1915 నుంచి 1947 వరకు మహాత్మా గాంధీ నాయకత్వంలో ఈ దేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగాయి అయినప్పటికీ బలమైన బ్రిటిష్ సామ్రాజ్యం గాంధీజీని ముట్టుకునే సాహసం కూడా చేయలేక పోయిందని తెలిపారు. దురదృష్టం ఏంటంటే స్వాతంత్రం సిద్ధించిన ఆరు నెలల్లోనే మన దేశానికి చెందిన మత శక్తులు మహాత్మా గాంధీని పట్టపగలు తుపాకీ గుళ్ళతో కాల్చి చంపాయి అన్నారు. బలమైన సామ్రాజ్యవాద బ్రిటిష్ ప్రభుత్వం గాంధీని ముట్టుకోలేకపోయింది కానీ మన దేశానికి చెందిన మతవాద శక్తులు మనమంతా మహాత్ముడిగా పిలుచుకునే గాంధీజీనీ చంపేశాయి అన్నారు.
గాంధీజీ మనకు స్వేచ్ఛను ఇచ్చారు, పెరియార్ ఆత్మగౌరవాన్ని ఇచ్చారు, కామరాజు నిజాయితీని ఇచ్చారు, అన్నా దురై మనకు గౌరవాన్ని ఇచ్చారు ఈ వరసత్వానికి తగిన భవిష్యత్తు ను మన బిడ్డలకు ఇవ్వాలి అదే కాంగ్రెస్ లక్ష్యం, నైతిక కర్తవ్యం, చారిత్రాత్మక బాధ్యత అని డిప్యూటీ సీఎం తెలిపారు. సభలో తమిళనాడు పిసిసి అధ్యక్షుడు సెల్వ, ఏ సి సి సెక్రటరీ చోలాంకర్ జి తదితరులు పాల్గొన్నారు.
Perni Nani: ఇంతకీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? లడ్డూ వివాదంపై పేర్ని నాని ఆగ్రహం
