Bhatti Vikramarka : దమ్ముంటే చర్చకు రండి.. కేసీఆర్ కు భట్టి ఓపెన్ ఛాలెంజ్.!

  • గత ప్రభుత్వంపై భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు
  • బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై అప్పుల లెక్కలు వెల్లడి
  • సింగరేణి వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు
  • ప్రతిపక్షాలకు బహిరంగ చర్చకు డిప్యూటీ సీఎం సవాల్
Bhatti

Bhatti

Bhatti Vikramarka : గత కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిన భారీ అప్పులు, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రస్తుతం లేనిపోని అబద్ధాలను ప్రచారం చేస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పష్టమైన లెక్కలను బయటపెట్టిన ఆయన.. గత పాలకులు రాష్ట్రంపై సుమారు రూ. 8,21,651 కోట్ల అప్పులు , బకాయిల భారాన్ని మిగిల్చారని, వాటిని ప్రస్తుత ప్రభుత్వం ఎంతో శ్రమతో క్రమబద్ధీకరిస్తోందని వెల్లడించారు. అలాగే రెసిడెన్షియల్ పాఠశాలల్లోని పిల్లలకు నాణ్యమైన భోజనం, బట్టలు , కనీస సౌకర్యాలను కల్పించడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, తమ ప్రభుత్వం వచ్చాకే విద్యా సంస్థల్లోని వసతులను మెరుగుపరిచి సంక్షేమానికి పెద్దపీట వేసిందని స్పష్టం చేశారు.

సింగరేణి వ్యవహారంపై విజిలెన్స్ విచారణ.. ప్రతిపక్షాలకు బహిరంగ సవాల్..

సింగరేణి సంస్థపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను డీప్యూటీ సీఎం తీవ్రంగా ఖండించారు. బొగ్గు గనుల కేటాయింపులు, ఉత్పత్తికి సంబంధించి గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించి సంస్థను నష్టాల్లోకి నెట్టిందని, ప్రస్తుత ప్రభుత్వం సింగరేణిని కాపాడుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని వివరించారు. సింగరేణిలో జరిగిన గత ప్రభుత్వ కాలపు అక్రమ వ్యవహారాలపై తాము విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తున్నట్లు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో, బయటా అబద్ధపు ప్రచారాలు చేయడం మానుకోవాలని హెచ్చరించిన ఆయన, దమ్ముంటే తమతో నేరుగా బహిరంగ చర్చకు రావాలంటూ మాజీ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు.