దాడులు చేసే సంస్కృతికి బీజేపీ వ్యతిరేకమని ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంట్ సభ్యుడు తన నియోజకవర్గంలో పర్యటిస్తే దాడులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. దాడులకు బీజేపీ కార్యకర్తలు భయపడరన్నారు. రుణ మాఫీ ,డబల్ బెడ్ రూమ్ ,పెన్షన్ లాంటి పనులు సరిగా ఇవ్వని టీఆర్ఎస్ నాయకులపై ఇలానే దాడులు చేయమంటారా అంటూ ఫైర్ అయ్యారు. సిద్ధాంతం కోసం త్యాగాలు చేయడానికైనా కాషాయ కార్యకర్తలు వెనుకడారన్నారు. నంబర్ వన్ తెలంగాణ ద్రోహి కేసీఆర్ అన్నారు. దాడులు చేసేందుకా తెలంగాణ తెచ్చుకుంది అంటూ టీఆర్ఎస్ను నిలదీశారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తూ భయానక వాతావరణం సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజల కోసం నేను చావడానికైనా సిద్ధం ..కేసీఆర్ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఒక్కసారి మేము మీలాగే దాడులు చేయడం స్టార్ట్ చేస్తే …బిస్తరి కట్టుకుని వెళ్తారన్నారు.
Read Also: తెలంగాణలో మరో మంత్రికి కరోనా.. రెండోసారి పాజిటివ్..
పార్లమెంట్లో తెలంగాణ ఓటింగ్ బిల్లుకు బీజేపీ మద్దతు ఇవ్వకుంటే ఇవాళ కేసీఆర్ సీఎం అయ్యేవాడా అంటూ ప్రశ్నించారు. ఏడాది మాత్రమే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వస్తుందన్నారు. ఐపీఎస్ అధికారులు ఈ ప్రభుత్వ ధోరణితో విసిగిపోయి సరిగా డ్యూటీలు చేయలేకపోతున్నారన్నారు. ప్రభుత్వానికి భయపడి, లోంగిపోయి పోలీసులు చట్ట వ్యతిరేకంగా డ్యూటీ చేస్తుంటే ప్రజలు అసహ్యంచుకుంటున్నారన్నారు. నిజామాబాద్ సీపీ నేతృత్వంలో జరిగిన హత్యయత్నం ఇది అని సంజయ్ ఆరోపించారు. పార్లమెంట్ సభ్యుడి పై దాడి చేస్తే ఇప్పటికి ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీకి ఖలిస్థాన్ సంస్థ లాంటి వాటితో సంబధాలున్నాయా..? అంటూ విరుచుకుపడ్డారు. ప్రధానిని అడ్డుకుంది రైతులు అన్నారు. మేమే అడ్డుకున్నామని ఖలిస్తాన్ ప్రకటించిందని తెలిపారు. నిజామాబాద్ లోను రైతులు దాడి చేశారని టీఆర్ఎస్ చెబుతుంది. కానీ రైతులు ఎవ్వరూ కర్రలు, కత్తులతో దాడి చేయరని సంజయ్ అన్నారు.