NTV Telugu Site icon

Bandi Sanjay : అది నిరూపిస్తే రాజకీయాల్లోంచి తప్పుకుంటా..

తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో దేవరకద్రలో బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర సభ నిర్వహించింది. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలమూరు నుంచి వలసలు లేవని అంటున్నారని, కానీ ఇప్పటికీ పాలమూరు ప్రజలు ఉపాధి కోసం వలస వెళ్లిపోతున్నారని ఆయన అన్నారు. పాలమూరు నుంచి వలసలు లేవని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలంటూ సీఎం కేసీఆర్ కు చాలెంజ్ చేశారు బండి సంజయ్‌. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాలమూరు జిల్లాను పచ్చగా చేస్తామని బండి సంజయ్‌ అన్నారు.

పాలమూరులో బీజేపీ ఎక్కడుందని టీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, పాలమూరులో ప్రాజెక్టుల నిర్మాణాలు కాంగ్రెస్, టీఆర్ఎస్ వల్ల పూర్తికాలేదని ఆయన ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వండని, తాము ప్రతి హామీని నిలబెట్టుకుంటామని బండి వ్యాఖ్యానించారు. దేవరకద్ర నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ది జరగలేదన్న బండి.. చెక్ డ్యాంలు, ఇసుక కాంట్రాక్టులతో టీఆర్ఎస్ నాయకులు కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు.