NTV Telugu Site icon

Bandi Sanjay : అమిత్ షా, జేపీ నడ్డాలను చంద్రబాబు కలిస్తే తప్పేంటి?

Bandi Sanjay Bjp

Bandi Sanjay Bjp

తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ పొత్తుకు సిద్ధమైందని వచ్చిన వార్తలు ఊహాగానాలేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కొట్టిపారేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాలను చంద్రబాబు కలిస్తే తప్పేముందని ప్రశ్నించారు. గతంలో మమతా బెనర్జీ, స్టాలిన్, నితీష్ కుమార్ వంటి ప్రతిపక్ష నేతలను కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్ షా కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. దేశాభివృద్ధే బీజేపీ లక్ష్యమని అన్నారు.

Ambati Rambabu: చంద్రబాబు ప్రవేశపెట్టింది మేనిఫెస్టో కాదు.. మోసఫెస్టో

ఈరోజు ఉదయం వివిధ జిల్లాల నేతలతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో నెలాఖరు వరకు జరిగే ‘మహజన్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. గడప గడపకూ బీజేపీ పేరుతో కేంద్ర ప్రభుత్వ ఫలాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అందుకోసం కార్యక్రమాలను మరింత ఉధ్రుతం చేయాలని కోరారు.

ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాలతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమైన నేపథ్యంలో టీడీపీతో బీజేపీ పొత్తుకు సిద్దమైనట్లుగా ఈరోజు మీడియాలో వచ్చిన వార్తలను పలువురు నేతలు బండి సంజయ్ వద్ద ప్రస్తావించగా అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. అలాంటి వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

‘‘కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిస్తే తప్పేముంది? దేశ సమగ్రాభివ్రుద్దే బీజేపీ లక్ష్యం. రాష్ట్రాల అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడినే కాదు… మమత బెనర్జీ, స్టాలిన్, కేసీఆర్, నితీష్ కుమార్ వంటి నేతలతో కూడా గతంలో మోదీ, అమిత్ షా సమావేశమయ్యారు.

కేసీఆర్ మాదిరిగా ప్రజలను, ప్రతిపక్ష పార్టీలను కలవకుండా ప్రగతి భవన్ కే పరిమితమై తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టే నైజం బీజేపీది కాదు. చంద్రబాబుతో పొత్తు గురించి చర్చించారనడం ఊహాజనితమే ‘‘అని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందన్నారు. పార్టీని దెబ్బతీసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ సహా మరికొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీలంతా కలిసే పోటీ చేయబోతున్నాయన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పాలనపట్ల విసిగిపోయారని, బీజేపీవైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. ఎఫ్పుడు ఎన్నికలు జరిగినా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమన్నారు.