Site icon NTV Telugu

Hyderabad: రూ.36 లక్షలతో పరారైన ఏటీఎం వ్యాన్ డ్రైవర్

హైదరాబాద్‌లో భారీ చోరీ జరిగింది. నగర శివారులోని దుండిగ‌ల్‌లో ఏటీఏం కేంద్రాల‌కు డ‌బ్బు తీసుకువెళ్లే వ్యాన్ డ్రైవర్ రూ.36 లక్షలతో పరారయ్యాడు. బేగంపేట‌కు చెందిన రైట‌ర్స్ సంస్థ సిబ్బంది ప‌లు ఏటీఏం కేంద్రాల్లో న‌గ‌దు జ‌మ చేస్తుంటారు. ఈ సంస్థ‌లో 20 రోజుల క్రిత‌మే సాగ‌ర్(25) అనే యువకుడు డ్రైవ‌ర్‌గా చేరాడు. శనివారం మ‌ధ్యాహ్నం రూ. 64 ల‌క్ష‌ల న‌గ‌దుతో క‌స్టోడియ‌న్‌లతో కలిసి సాగర్ రైటర్స్ సంస్థ కార్యాలయం నుంచి బయలుదేరి జీడిమెట్లలోని యాక్సిస్ బ్యాంకులో రూ.13 లక్షల నగదు జమ చేశారు.

అనంతరం జీడిమెట్ల నుంచి నేరుగా దుండిగ‌ల్ సాయిబాబా న‌గ‌ర్‌లోని యాక్సిస్ బ్యాంకు ఏటీఎం వ‌ద్ద‌కు వెళ్లారు. కస్టోడియన్‌లు వాహనంలోని రూ.15 లక్షలు తీసుకుని ఏటీఎంలోకి వెళ్లారు. డ్రైవర్ సాగ‌ర్ మాత్రం వాహనంలోనే ఉండి యూట‌ర్న్ తీసుకుని వస్తాన‌ని గ‌న్‌మెన్‌కు చెప్పి వెళ్లిపోయాడు. అయితే ఎంత‌సేప‌టికీ సాగ‌ర్ తిరిగి రాలేదు. అత‌డి ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వ‌చ్చింది. అనుమానం వ‌చ్చి క‌స్టోడియ‌న్‌లు, గ‌న్‌మెన్ క‌లిసి దుండిగ‌ల్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. రూ.36 ల‌క్ష‌ల న‌గ‌దు బ్యాగుతో డ్రైవ‌ర్ సాగ‌ర్ పారిపోయిన‌ట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. సాగ‌ర్ ఆచూకీ కోసం గాలింపు చ‌ర్య‌లు చేపట్టారు. న‌ర్సాపూర్ రోడ్డులో పోలీసులు ఏటీఎం వాహ‌నాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Exit mobile version