Harish Rao: ఉమ్మడి పాలన నాటి నీటి గోస దృశ్యాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల మళ్ళీ చూస్తున్నారు అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం చింతకర్ర గ్రామ గిరిజనులు తాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. మిషన్ భగీరథ నీళ్ల సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో వేసవి వేళ మారుమూల ప్రజలకు శాపంగా మారింది అని ఆయన ఆరోపించారు. ఇక, తమ భుజాలు కాయలు కాసేలా బిందెలు మోస్తూ, వాగులు, వ్యవసాయ బావుల నుంచి నీళ్ళు తెచ్చుకునే దుస్థితిని తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం అని విమర్శలు గుప్పించారు. పథకాలు అమలులో వైఫల్యం, పరిపాలనలో వైఫల్యం చివరకు కేసీఆర్ ప్రారంభించిన మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు సరఫరా చేయడంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు.