Meta AI: మెటాలో అంతర్గత తిరుగుబాటు.. ‘దారుణమైన తప్పులు చేశాం’ అంటూ దిగొచ్చిన యాజమాన్యం!

Meta

Meta

Meta AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్… ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న మాయా ప్రపంచం! ఈ ఏఐ రేసులో అందరికంటే ముందుండాలనే ఆత్రుతతో సోషల్ మీడియా దిగ్గజం మెటా చేసిన ఒక భారీ ప్రయోగం.. ఇప్పుడు ఆ సంస్థలోనే పెను తుఫాను సృష్టించింది. సిలికాన్ వ్యాలీలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో.. మెటా యాజమాన్యం మోకాళ్లపైకి వచ్చింది. తాము దారుణమైన తప్పులు చేశామని.. ఉద్యోగుల నమ్మకాన్ని దెబ్బతీశామంటూ మెటా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆండ్రూ బోస్వర్త్ స్వయంగా తప్పులు ఒప్పుకుంటూ అంతర్గత మెమో విడుదల చేయడం ఇప్పుడు టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది.

అసలు ఏం జరిగిందంటే..?

ఈ ఏడాది మార్చిలో కంపెనీ ఏఐ ప్రాజెక్టులను వేగవంతం చేయడం కోసం అప్లైడ్ ఏఐ అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసింది. వివిధ విభాగాల నుంచి దాదాపు 6,500 మంది ఇంజనీర్లు, ప్రొడక్ట్ మేనేజర్లను రాత్రికి రాత్రే ఈ కొత్త టీమ్‌లోకి మార్చేసింది. అయితే, ఈ మార్పు బలవంతంగా జరగడం.. అక్కడ చేయాల్సిన పని కేవలం ఏఐ మోడళ్లను ట్రైన్ చేయడానికి పజిల్స్, కోడింగ్ సమస్యలను సృష్టించడం వంటి రొటీన్ పనులు కావడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తమకు నచ్చని పనిని బలవంతంగా చేయించడాన్ని తట్టుకోలేక, కొందరు ఉద్యోగులు ఆ విభాగాన్ని ఏకంగా రష్యాలోని క్రూరమైన ఖైదీల క్యాంప్ గులాగ్ తో పోల్చారు. ఈ అంతర్గత తిరుగుబాటు కాస్తా వైర్డ్ పత్రిక ద్వారా ప్రపంచానికి తెలియడంతో మార్క్ జుకర్‌బర్గ్ టీమ్ షాక్‌కు గురైంది. సీటీఓ ఆండ్రూ బోస్వర్త్ ఉద్యోగులకు పంపిన లేఖలో… కంపెనీ భవిష్యత్తు ఆశయాలను మీకు వివరించడంలో, మీ కెరీర్‌కు ఈ మార్పు ఎలా ఉపయోగపడుతుందో చెప్పడంలో మేము అత్యంత దారుణమైన వైఫల్యాన్ని మూటగట్టుకున్నాం అని బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. దీనికి కొన్ని రోజుల ముందే సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సైతం ఒక మెమో విడుదల చేస్తూ.. ఈ మార్పుల సంక్లిష్టత వల్ల తాము తప్పులు చేశామని అంగీకరించారు. మెటాలో ఈ గందరగోళం ఇక్కడితో ఆగలేదు. గడిచిన మే నెలలో కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 8,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించడమే కాకుండా, మరో 7,000 మందిని ఏఐ ఆధారిత బృందాల్లోకి మార్చింది.

×
×
Ad

దీనికి తోడు ఉద్యోగుల కంప్యూటర్ మౌస్ కదలికలపై నిఘా పెట్టే మౌస్ ట్రాకింగ్ ప్రోగ్రామ్ తీసుకురావడంతో ఉద్యోగుల నైతిక స్థైర్యం దారుణంగా పడిపోయింది. తీవ్ర నిరసనల మధ్య ఆ నిఘా ప్రోగ్రామ్‌ను మెటా వెనక్కి తగ్గించుకోవాల్సి వచ్చింది. అయితే, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తామని, ఇకపై ఒక మేనేజర్ కింద కేవలం 20 మంది ఉద్యోగులు మాత్రమే ఉండేలా పరిమితి విధిస్తామని మెటా హామీ ఇచ్చింది. ఇదే సమయంలో ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయాలపై స్పందిస్తూ సీటీఓ ఆండ్రూ బోస్వర్త్ ఒక ఆసక్తికరమైన హెచ్చరిక చేశారు. ఏఐ మీ ఉద్యోగాన్ని లాక్కోదు.. కానీ, ఏఐ టెక్నాలజీ తెలిసిన మరొక వ్యక్తి మీ ఉద్యోగాన్ని లాక్కోవచ్చు, కాబట్టి జాగ్రత్త ఉండాలి. టెక్నాలజీ పరంగా ఎంత ముందడుగు వేసినా, కంపెనీని నడిపించే ఉద్యోగుల నమ్మకాన్ని కోల్పోతే విజయం సాధించలేమనే సత్యాన్ని మెటా ప్రస్తుత పరిస్థితి నిరూపిస్తోంది.