ఇక వైద్య చరిత్రలోనే మరో అద్భుతం అనేది ఆవిష్కృతం కానుంది. క్యాన్సర్ రోగులకు సంజీవని లాంటి ఓ డ్రగ్ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకొని మంచి ఫలితాలను సాధించింది. మల క్యాన్సర్తో బాధపడుతున్న రోగులపై దీన్ని ప్రయోగిస్తే అద్భుతమైన ఫలితాలు వచ్చాయని న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. అంతేకాదు.. ఈ మందు తీసుకున్న బాధితుల్లో పూర్తిగా క్యాన్సర్ వ్యాధి నయం అయిపోయిందట. ఈ విషయాన్ని అమెరికా మీడియా వెల్లడించింది. అక్కడి శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ ప్రయోగం సక్సెస్ అయిందని పేర్కొంది. డోస్టర్లిమాబ్ పేరుతో పిలిచే మందును వేసుకుంటే రెక్టర్ క్యాన్సర్ నుంచి విముక్తి కలుగుతుందని వెల్లడైంది. 18 మందిపై చేపట్టిన క్లినికల్ ట్రయల్స్ సత్ఫలితాలు ఇచ్చినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ మందు తీసుకుంటే ఇక మరే చికిత్స అవసరం లేదని తెలిపారు.
న్యూయార్క్కు చెందిన మెమోరియల్ స్లోయన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో గత ఆరు నెలలుగా ఈ పరిశోధన చేస్తున్నారు. రీసెర్చ్లో సత్ఫలితాలు రావడంపై శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత సాధించడం చరిత్రలో తొలిసారని అన్నారు పరిశోధకులు డాక్టర్ లూయిస్ ఏ.డయాస్ జే. ఈ మందుతో కిమోథెరపీ, రేడియేషన్, సర్జరీ మొదలైన కష్టమైన చికిత్సలను నివారించొచ్చని పేర్కొన్నారు. క్లినికల్ ట్రయల్స్లో భాగంగా 18 మంది బాధితులకు గత ఆరునెలల్లో ప్రతీమూడు వారాలకు ఓసారి ఈ డోస్టర్లిమాబ్ ఇచ్చామని వెల్లడించారు. ఆశ్చర్యకరంగా అందరికీ నయమైపోయినట్లు వివరించారు. ఇక ఈ ఫలితాలు ఇప్పుడు వైద్య ప్రపంచంలో పెద్ద సంచలనం రేపుతున్నాయి.