చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ అయిన శివశక్తి పాయింట్ చుట్టూ ప్రజ్ఞాన్ రోవర్ తిరుగుతున్నట్లు చూపించే వీడియోను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శనివారం విడుదల చేసింది. "ప్రజ్ఞాన్ రోవర్ దక్షిణ ధృవం వద్ద చంద్ర రహస్యాలను వెతకడానికి శివశక్తి పాయింట్ చుట్టూ తిరుగుతోంది." అని ట్విటర్ వేదికగా చెప్పింది.
చంద్రునిపై పరిశోధనలు జరిపేందుకు ప్రయోగించిన చంద్రయాన్-3 సురక్షితంగా జాబిల్లిపై దిగడంతో అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది. ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలుమోపగా.. కొన్ని గంటల అనంతరం రోవర్ బయటకు వచ్చి తన అధ్యయనాన్ని ప్రారంభించింది.
చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రునిపై ల్యాండ్ అయింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలు మోపిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో ఇస్రో కీర్తి ప్రపంచ వ్యాప్తమయింది. ఈ తరుణంలో ప్రపంచ దేశాల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా జాబిల్లిపై దాగి ఉన్న రహస్యాలు తెలుసుకునేందుకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్ జీవితకాలం కేవలం 14 రోజులే కావడం గమనార్హం.