Junior NTR: మంగళవారం నాడు హైదరాబాద్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ను టీమిండియా క్రికెటర్లు కలవడం చర్చనీయాంశంగా మారింది. న్యూజిలాండ్తో తొలి వన్డే సందర్భంగా హైదరాబాద్ వచ్చిన టీమిండియా ఆటగాళ్లు ప్రత్యేకంగా ఎన్టీఆర్ను కలిసి సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ అయితే తన సతీమణి దేవిశాతో కలిసి ఎన్టీఆర్తో ప్రత్యేకంగా ఫొటో దిగాడు. ఈ ఫొటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న సూర్యకుమార్.. ‘బ్రదర్, నిన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలిచినందుకు మరోసారి కంగ్రాట్స్’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
Read Also: Hotel Bill : లగ్జరీ హోటళ్లో దిగాడు.. లక్షల బిల్లు ఎగ్గొట్టాడు
సూర్యకుమార్ పోస్ట్కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించాడు. ‘సూర్య, థ్యాంక్యూ సో మచ్. నిన్ను కలవడం నాకూ ఆనందంగా ఉంది. రేపటి మ్యాచ్లో దుమ్మురేపు’ అంటూ బదులిచ్చాడు. ప్రస్తుతం సూర్య, ఎన్టీఆర్ పోస్టులు నెట్టింట వైరల్గా మారాయి. కాగా బుధవారం న్యూజిలాండ్తో జరగనున్న తొలి వన్డేలో సూర్యకుమార్కు తుది జట్టులో స్థానం దక్కనుంది. ఈ సిరీస్కు శ్రేయాస్ అయ్యర్ దూరం కావడంతో అతడి స్థానంలో సూర్యకు ప్లేస్ ఖరారైంది. అయితే ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో తొలి రెండు వన్డేలకు జట్టులో సూర్యకుమార్కు చోటు దక్కలేదు. మూడో వన్డేలో హార్దిక్ పాండ్యా స్థానంలో సూర్యకు అవకాశం కల్పించినా అతడు పెద్దగా రాణించలేకపోయాడు. మరి శ్రీలంకతో టీ20 సిరీస్లో సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్ న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో వేచి చూడాలి.