Delhi Capitals: మహిళల ప్రిమియర్ లీగ్లో ఆర్సీబీ సంచలన సృష్టించింది. ఈ సీజన్లో మిగతా జట్లన్నీ ఒక వైపు.. బెంగళూరు మరోవైపు అన్న స్థాయిలో దూసుకుపోయింది. వరుసగా అయిదు మ్యాచ్ల్లో గెలిచి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. అత్యధిక విజయాలతో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్కు దూసుకెళ్లింది. ఇక తుది పోరులో 200 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించి విజయ బావుటా ఎగరేసింది. కానీ.. మరోవైపు ప్రత్యర్థి టీంకి మాత్రం ఎన్నో ఏళ్లుగా కన్నీళ్లే మిగులుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్కు నిజంగా గురువారం రాత్రి ఓ ఎంతో భావోద్వేగంతో ముగిసింది. మహిళల ప్రీమియర్ లీగ్లో తమ చరిత్రలోనే అత్యధిక స్కోరు చేసినా గెలుపు దూరమైంది. ప్లే ఆఫ్స్లో ఇది రెండో అతిపెద్ద స్కోరు అయినా, ఢిల్లీకి మాత్రం అది ఓటమి బాధను తగ్గించలేకపోయింది. వడోదరలో జరిగిన ఈ ఫైనల్లో మరోసారి ఢిల్లీ ఆశలు నేలచూపులు చూశాయి.
READ MORE: Vijayawada Robbery: ఉద్యోగం తీశారని కోపం.. తుపాకీతో బెదిరించి డబ్బుతో పరారీ
ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతంగా ఆడింది. కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ బాధ్యతను తన భుజాలపై వేసుకుని చక్కని అర్ధసెంచరీ చేసింది. అనుభవం ఉన్న లారా వోల్వార్ట్తో కలిసి బంతిని ఖాళీ ప్రాంతాల్లోకి పంపిస్తూ ఆర్సీబీపై ఒత్తిడి పెంచింది. ఈ ఇద్దరి మధ్య 76 పరుగుల భాగస్వామ్యం మ్యాచ్కు ఊపునిచ్చింది. చివర్లో చినెల్ హెన్రీ రంగంలోకి దిగింది. కేవలం 15 బంతుల్లోనే 35 పరుగులు చేసి స్కోరును భారీగా మార్చింది. అలా ఢిల్లీ 4 వికెట్లకు 203 పరుగులు చేసి, ఫైనల్కు తగిన లక్ష్యాన్ని నిలబెట్టింది. ఇంత పెద్ద స్కోరు చేసిన తర్వాత ఈసారి అయినా కప్ వస్తుందనే నమ్మకం ఢిల్లీ శిబిరంలో కనిపించింది. కానీ ఆ ఆశ ఎక్కువ సేపు నిలవలేదు. లక్ష్య ఛేదనలో ఆర్సీబీ ఓపెనర్ గ్రేస్ హారిస్ను ఢిల్లీ తొందరగా అవుట్ చేసి శుభారంభం చేసింది. కాసేపటికి మ్యాచ్ తమ వైపే వస్తుందేమో అన్న భావన కలిగింది. కానీ అక్కడి నుంచి స్మృతి మంధాన, జార్జియా వాల్ కలిసి కథను పూర్తిగా మార్చేశారు. ఈ ఇద్దరూ రెండో వికెట్కు ఏకంగా 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చక్కటి డ్రైవ్తో రన్రేట్ను అదుపులో ఉంచారు. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆర్సీబీ స్కోరు 100కు చేరింది. ఇంకా 10 ఓవర్లలో 104 పరుగులు కావాల్సి ఉన్నా, మంధాన–వాల్ జోడీపై ఎవరికీ సందేహం రాలేదు. చివర్లో జార్జియా వాల్ మిన్ను మణి బౌలింగ్లో అవుట్ కావడంతో ఢిల్లీకి ఒక చిన్న ఆశ కనిపించింది. కానీ అది కొద్ది క్షణాలకే పరిమితమైంది. మిగతా బ్యాటర్లు ప్రశాంతంగా ఆడి, చివరి ఓవర్లోనూ ఒత్తిడికి లోనుకాకుండా రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించారు. దీంతో ఆర్సీబీ రెండోసారి డబ్ల్యూపీఎల్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్తో కలిసి అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్ల జాబితాలో ఆర్సీబీ చేరింది.
ఓటమి తర్వాత ఢిల్లీ శిబిరంలో కనిపించిన దృశ్యాలు హృదయాన్ని కలచివేశాయి. కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ కళ్లలో నీళ్లు తిరుగుతూ నేరుగా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లిపోయింది. అంతా కళ్ల ముందే జరుగుతుండగా, ఢిల్లీ ఫ్రాంచైజ్తో చాలాకాలంగా అనుబంధం ఉన్న సౌరవ్ గంగూలీ మాటలు రాక నిశ్శబ్దంగా నిలిచిపోయారు. తాను మంచి ఇన్నింగ్స్ ఆడినా, జట్టు గెలవకపోవడం జెమిమాకు మరింత బాధ కలిగించింది. ఇది ఢిల్లీ క్యాపిటల్స్కు వరుసగా నాలుగో ఫైనల్ ఓటమి. 2023లో ముంబై ఇండియన్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో, 2024లో ఆర్సీబీ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో, 2025లో ముంబై చేతిలో ఎనిమిది పరుగుల తేడాతో ఓడిన ఢిల్లీ, ఇప్పుడు మరోసారి ఫైనల్లోనే కూలిపోయింది. మహిళల ఫ్రాంచైజ్ క్రికెట్ చరిత్రలో ఇలా వరుసగా నాలుగు ఫైనల్స్ ఓడిన రెండో జట్టుగా ఢిల్లీ నిలిచింది. ఈ జాబితాలో ముందుగా ఉన్నది బ్రిస్బేన్ హీట్ మాత్రమే. మొత్తానికి, భారీ స్కోరు చేసినా, మంచి ప్రదర్శన ఇచ్చినా, కప్ మాత్రం ఢిల్లీకి అందరి ద్రాక్షలా మిగిలిపోయింది!