ఐపీఎల్ మ్యాచ్లు నెమ్మదిగా రసపట్టును తలపిస్తున్నాయి. సీజన్ ఆరంభ మ్యాచ్ తేలిపోయినా.. సూపర్ సండేనాడు జరిగిన రెండు మ్యాచ్లు క్రికెట్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించాయి. తొలుత ముంబై-ఢిల్లీ మ్యాచ్, అనంతరం బెంగళూరు-పంజాబ్ మ్యాచ్ ఉర్రూతలూగించాయి. ఈ రెండు మ్యాచ్లలో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే గెలిపించాయి. తొలి మ్యాచ్లో ఢిల్లీ ఓడిపోయేలా కనిపించగా.. లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ పోరాడి తమ జట్టును గెలిపించారు. ముఖ్యంగా లలిత్ యాదవ్ 48 పరుగులతో అజేయంగా నిలిచి ఢిల్లీ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
ఇదే మ్యాచ్లో అంతకంటే ముందు ముంబై ఇన్నింగ్స్ సందర్భంగా ఢిల్లీ బౌలర్ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లతో రాణించాడు. 2019 తర్వాత అతడు ఓ మ్యాచ్ లో మూడు వికెట్ల తీయడం ఇదే తొలిసారి. మరోవైపు ఐపీఎల్ తొలి మ్యాచ్ చెన్నై-కోల్కతా జట్ల మధ్య జరగ్గా.. కోల్కతా బౌలర్ ఉమేష్ యాదవ్ రెండు వికెట్లతో చెలరేగాడు. తొలి ఓవర్లోనే గత ఏడాది ఆరెంజ్ క్యాప్ హోల్డర్ రుతురాజ్ గైక్వాడ్ వికెట్ తీసి మ్యాచ్ను మలుపు తిప్పాడు.
ఈ నేపథ్యంలో ఉమేష్ యాదవ్, కుల్దీప్ యాదవ్, లలిత్ యాదవ్… ఇలా ముగ్గురి ప్రదర్శనను ఉద్దేశిస్తూ టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ చేసి ట్వీట్ దుమారం రేపింది. ’ప్రస్తుతం యాదవుల ఐపీఎల్ జరుగుతుంది‘ అని అర్థం వచ్చేలా సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్పై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. క్రికెట్కు ప్రాంతం, కులాన్ని అంటగట్టడం మంచిది కాదని అభిమానులు ఫైర్ అవుతున్నారు.