NTV Telugu Site icon

IND Playing 11: స్టార్ ఆటగాడిపై వేటు.. సంజూకు చోటు! ఇంగ్లండ్‌తో ఆడే భారత్ తుది జట్టు ఇదే

Team India

Team India

Ravindra Jadeja out and Sanju Samson in For IND vs ENG Semi Final 2: టీ20 ప్రపంచకప్‌ 2024లో సెమీఫైనల్స్‌కు రంగం సిద్ధమైంది. గురువారం (జూన్ 27) ఒక్క రోజులోనే రెండు సెమీస్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం.. ఉదయం 6 గంటలకు ఆరంభమయ్యే తొలి సెమీస్‌లో దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌ జట్లు తలపడనున్నాయి. రాత్రి 8 గంటలకు మొదలయ్యే రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌ను భారత్‌ ఢీకొనబోతోంది. బలాబలాల్లో భారత్‌, ఇంగ్లండ్‌ సమఉజ్జివులుగా ఉన్న నేపథ్యంలో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.

టీ20 ప్రపంచకప్‌ 2022లో ఇంగ్లండ్‌తోనే భారత్ సెమీఫైనల్ ఆడింది. ఆ మ్యాచ్‌లో టీమిండియాను ఇంగ్లండ్‌ చిత్తుచిత్తుగా ఓడించింది. 169 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 16 ఓవర్లోనే ఛేదించింది. అప్పటికంటే ఇప్పుడు ఇంగ్లీష్ జట్టు పటిష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించాలంటే భారత్‌కు అంత ఈజీ కాదు. ఇంగ్లండ్‌ను ఓడించాలంటే.. అత్యుత్తమ జట్టుతో భారత్ బరిలోకి దిగాల్సి ఉంది. ఈ క్రమంలో టీమిండియా మేనేజ్మెంట్ తుది జట్టులో ఓ మార్పు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

టీ20 ప్రపంచకప్‌ 2024లో రవీంద్ర జడేజా నిరాశపర్చుతున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో తేలిపోయాడు. ఈ నేపథ్యంలో జడేజా స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్‌ సంజు శాంసన్‌‌ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గయానా పిచ్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంటుంది. అందుకే శాంసన్‌ను తీసుకుంటే.. భారీ స్కోరు లేదా భారీ ఛేదనను చేయవచ్చని భారత్ భావిస్తోంది. ఇంగ్లండ్ జట్టు పటిష్టంగా ఉండడంతో శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి కెప్టెన్ రోహిత్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

Also Read: Frank Duckworth Death: ‘డక్‌వర్త్ లూయిస్’ రూపకర్త ఫ్రాంక్ డక్‌వర్త్ మృతి!

భారత తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా/సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.