T20 World Cup: టీ20 వరల్డ్ కప్ వివాదాలు ఇంకా ముగియడం లేదు. బంగ్లాదేశ్ భారత్లో భద్రతా కారణాలు చూపుతూ ఆడేందుకు నిరాకరించింది. దీంతో ఐసీసీ ఆ దేశాన్ని టోర్నీ నుంచి బహిష్కరించింది. మరోవైపు, బంగ్లాకు మద్దతుగా భారత్తో తాము మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వెల్లడించింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇదిలా ఉంటే, టోర్నీ మొత్తాన్ని కాకుండా, కేవలం ఒక జట్టుతో జరగాల్సిన మ్యాచ్ను బహిష్కరిస్తే పాకిస్తాన్ ఐసీసీ తీవ్ర చర్యలకు గురికావాల్సి వస్తుంది. దీంతో పాక్ క్రికెట్ బోర్డుకు తీవ్రమై ఆర్థిక నష్టమే కాకుండా, న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే, ఇప్పుడు దాయాది జట్టు తన బాయ్కాట్ నిర్ణయంపై ‘‘యూటర్న్’’ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరిగే భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ బహిష్కరణ నిర్ణయాన్ని పీసీబీ మరోసారి సమీక్షించాలనుకుంటోంది. బాయ్కాట్ నిర్ణయాన్ని మార్చుకోవాలని శ్రీలంక, పాకిస్తాన్ను కోరింది. ఈ మ్యాచ్ జరగకపోతే శ్రీలంక క్రికెట్కు భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుందని, టోర్నమెంట్ ఇమేజ్ దెబ్బతింటున్నది పేర్కొంది. ఈ మేరకు పీసీబీకి శ్రీలంక బోర్డు ఈమెయిల్ కూడా పంపించింది.
దీంతో బాయ్కాట్ నిర్ణయంపై పాక్ క్రికెట్ బోర్డు తన ప్రభుత్వాన్ని సంప్రదించింది. పాక్ ప్రభుత్వానికి, శ్రీలంక ప్రభుత్వానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. క్రికెట్ స్థాయిలో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. గతంలో పాక్ పర్యటనలో ఉన్న సమయంలోనే శ్రీలంక టీమ్పై దాడి కూడా జరిగింది. దీంతో శ్రీలంక అభ్యర్థన విస్మరించలేమని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
“శ్రీలంక బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వా నేరుగా మొహ్సిన్ నఖ్వీని సంప్రదించి, ఈ సమయంలో శ్రీలంకకు పాకిస్థాన్ మద్దతు అవసరమని గుర్తు చేశారు. ఎందుకంటే పాకిస్థాన్,భారతదేశం మ్యాచ్లు లేకపోతే, శ్రీలంక బోర్డు గేట్ మనీ, హాస్పిటాలిటీ రంగాలపై మొదలైన వాటి నుండి అదనపు ఆదాయాన్ని కోల్పోతుంది,” అని చెప్పినట్లు సమాచారం. పీసీబీ ఛైర్మన్ మోహ్సీన్ నఖ్వీ , పాక్ ప్రధాని దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తారని చెప్పారు.
