Site icon NTV Telugu

T20 World Cup 2026: పాకిస్థాన్‌కు డేంజర్ బెల్స్.. రెండు మ్యాచ్‌లు ఓడితే ఇంటికే!

Pakistan Cricket

Pakistan Cricket

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో పాకిస్థాన్ జట్టు పరిస్థితి ప్రస్తుతం ఆ దేశ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ఫిబ్రవరి 15న భారత్‌తో జరిగే లీగ్ మ్యాచ్‌ను బహిష్కరించడం వల్ల పాక్ ఒక మ్యాచ్‌ను కోల్పోయింది. అంతేకాదు కీలకమైన రెండు పాయింట్లు కూడా టీమిండియా ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ స్టేజ్‌లో పాకిస్థాన్‌కు ఒత్తిడి మరింత పెరిగింది. ప్రస్తుత ఫార్మాట్ ప్రకారం.. ఒక జట్టు రెండు మ్యాచ్‌లు ఓడితే సూపర్ 8 అవకాశాలు దాదాపుగా ముగిసినట్టే.

ఇప్పటికే లీగ్ మ్యాచ్‌ను బహిష్కరించడం వల్ల భారత్‌ చేతిలో పాకిస్థాన్ ఓడినట్లే లెక్క. మరో రెండు మ్యాచ్‌లు కోల్పోతే టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది. అందుకే ఇకపై ప్రతి మ్యాచ్ పాకిస్థాన్‌కు డూ ఆర్ డైగా మారింది. మరింత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. పాక్ మిగిలిన మ్యాచ్‌లలో ఢీకొట్టాల్సింది అమెరికా, నెదర్లాండ్స్, నమీబియాలను. ఈ జట్లను తేలికగా తీసుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇటీవల జరిగిన ఐసీసీ టోర్నీల్లో ఈ టీమ్స్ పెద్ద జట్లకు షాకులు ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అమెరికా, నెదర్లాండ్స్, నమీబియాలు పాకిస్థాన్‌కు గట్టి పోటీ ఇవ్వగలవు.

Also Read: T20 World Cup 2026: బంగ్లాదేశ్ మనకు ఏం చేసింది?.. పీసీబీపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు!

బ్యాటింగ్‌లో స్థిరత్వం లేకపోవడం, బౌలింగ్‌లో కీలక సమయాల్లో పరుగులు ఇవ్వడం వంటి సమస్యలు పాకిస్థాన్‌ను ప్రస్తుతం వెంటాడుతున్నాయి. టీమ్ కాంబినేషన్‌పై కూడా స్పష్టత లేదు. ఈ పరిస్థితుల్లో ప్రతి మ్యాచ్‌లోనూ పాక్ 100 శాతం ప్రదర్శన ఇవ్వకపోతే మెగా టోర్నీలో ముందుకు సాగడం కష్టమే. టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ ప్రయాణం ప్రస్తుతం నల్లేరుపై నడకే అనే చెప్పాలి. ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ పాక్ భవితవ్యాన్ని నిర్ణయించనుంది. జట్టు ప్రదర్శనలో భారీ మార్పులు వస్తే తప్ప.. పాకిస్థాన్‌ సూపర్ 8 వెళ్ళలేదు.

Exit mobile version