భారత్, శ్రీలంక సంయుక్తంగా ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 వరల్డ్ కప్ 2026 జరగనుంది. 2025 ఆసియా కప్కు అర్హత సాధించడంలో విఫలమైన పసికూన నేపాల్.. మెగా టోర్నీలో ఆడనుంది. వరల్డ్ కప్ కోసం నేపాల్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. మెగా టోర్నీలో ఆల్రౌండర్ రోహిత్ పౌడెల్ నేపాల్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. మరో ఆల్రౌండర్ దీపేంద్ర సింగ్ ఐరీ వైస్ కెప్టెన్గా నియమితులయ్యాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్టార్ సందీప్ లామిచానే నేపాల్ జట్టులో ఉన్నాడు.
25 ఏళ్ల సందీప్ లామిచానే ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)కి ప్రాతినిధ్యం వహించాడు. ఢిల్లీ తరపున తొమ్మిది మ్యాచ్ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. నేపాలీ జట్టు విజయాల్లో సందీప్ కీలక పాత్ర పోషించనున్నాడు. గుల్షన్ ఝా, లలిత్ రాజ్బన్షి, కరణ్ కెసి, సోంపాల్ కామి వంటి స్టార్లు కూడా జట్టులో ఉన్నారు. టాప్ ఆర్డర్లో కుశాల్ భుర్టెల్ దూకుడు బ్యాటింగ్ నేపాల్కు కలిసిరానుంది. ఆసిఫ్ షేక్ వికెట్ కీపింగ్ చేయనున్నాడు. మిడిల్ ఆర్డర్లో లోకేష్ బామ్ జట్టును ఆదుకోనున్నాడు. సందీప్ జోరా, ఆరిఫ్ షేక్లతో బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతం కానుంది.
ఫాస్ట్ బౌలింగ్ యూనిట్కు సోంపాల్ కామి, కరణ్ కెసి నాయకత్వం వహిస్తారు. ఇద్దరూ కొత్త బంతిని స్వింగ్ చేయగలరు. నందన్ యాదవ్, షేర్ మల్లా పేస్ బౌలింగ్ కోటాలో ఎంపికయ్యారు. 2024 టీ20 ప్రపంచకప్లో నేపాల్ నిరాశపరిచింది. నాలుగు మ్యాచ్ల్లోనూ ఓడిపోయి గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. టీ20 వరల్డ్ కప్ 2026లో నేపాలీ జట్టు గ్రూప్ సిలో ఉంది. ఈ గ్రూప్లో ఇంగ్లాండ్, ఇటలీ, వెస్టిండీస్, బంగ్లాదేశ్ ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం… నేపాలీ జట్టు తన నాలుగు లీగ్ మ్యాచ్లను ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆడుతుంది. ఫిబ్రవరి 8న ఇంగ్లాండ్తో నేపాల్ తన మొదటి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత వరుసగా ఇటలీ, వెస్టిండీస్, బంగ్లాదేశ్తో తలపడుతుంది.
నేపాల్ జట్టు:
రోహిత్ పౌడెల్ (కెప్టెన్), దీపేంద్ర సింగ్ ఎయిరీ (వైస్ కెప్టెన్), సందీప్ లమిచానే, కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్ (వికెట్ కీపర్), సందీప్ జోరా, ఆరిఫ్ షేక్, బసీర్ అహ్మద్, కరణ్ యాడ్వ్ సి, సోంపాల్, సి. రాజబన్షి, షేర్ మల్లా, లోకేష్ బామ్.
నేపాల్ గ్రూప్ మ్యాచ్ షెడ్యూల్:
ఫిబ్రవరి 08, vs ఇంగ్లాండ్, ముంబై
ఫిబ్రవరి 12, vs ఇటలీ, ముంబై
ఫిబ్రవరి 15, vs వెస్టిండీస్, ముంబై
ఫిబ్రవరి 17, vs బంగ్లాదేశ్, ముంబై