భారత్తో మ్యాచ్లో కీలక సందర్భాల్లో తమ ప్రణాళికలు పని చేయలేదని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా అలీ చెప్పాడు. కీలక పవర్ ప్లేలోనే వికెట్లు కోల్పోవడం తమ కొంపముంచిందన్నాడు. గత ఆరు నెలలుగా తమ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారని, అందుకే వారిపైనే నమ్మకం ఉంచామని.. అయితే భారత్తో మ్యాచ్లో వారికి కలిసి రాలేదని వివరించాడు. పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ చేయడంలో తమ బౌలర్లు విఫలమయ్యారని సల్మాన్ అఘా చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం భారత్తో జరిగిన మ్యాచ్లో పాక్ 61 పరుగుల తేడాతో ఓడిపోయింది.
మ్యాచ్ అనంతరం సల్మాన్ అఘా అలీ మాట్లాడుతూ… ‘మా స్పిన్నర్లపై ఎంతో నమ్మకం పెట్టుకున్నాం. అయితే ఈరోజు ఆశించిన స్థాయిలో వారు రాణించలేకపోయారు. ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయలేకపోయారు. అయితే మా స్పిన్నర్లపై నమ్మకం ఉంది. ఎందుకంటే గత 6 నెలలుగా అద్భుతంగా రాణిస్తున్నారు. మా బ్యాటింగ్ చాలా చెత్తగా ఉంది. పవర్ప్లేలోనే మూడు లేదా నాలుగు వికెట్లు కోల్పోతే టీ20ల్లో ఎప్పుడూ ఒత్తిడిలోనే మ్యాచ్ ఆడాల్సి వస్తుంది. మాకు మంచి ఆరంభం దక్కలేదు, అందుకే మ్యాచ్ను ఛేజ్ చేయడం కష్టమైంది’ అని చెప్పాడు.
మొదట బౌలింగ్ ఎందుకు ఎంచుకున్నారన్న ప్రశ్నకు సమాధానంగా… ‘మొదటి ఇన్నింగ్స్లో పిచ్ కొంచెం స్టిక్కీగా ఉంది. బంతి గ్రిప్ అవుతోందని భావించాం. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు పిచ్ మెరుగ్గా మారుతుందని భావించి.. ఆ నిర్ణయం తీసుకున్నాము. కానీ బౌలర్లు పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ చేయలేకపోయారు. ఇలాంటి హైప్రెజర్ మ్యాచ్ల్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. కానీ అనుభవం ఉన్న జట్టుగా వాటిని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. రెండు రోజుల్లో మరో మ్యాచ్ ఉంది. ఈ ఓటమి నుంచి త్వరగా బయటపడి.. మళ్లీ ఫోకస్ పెట్టాలి. వచ్చే మ్యాచ్ గెలిస్తే సూపర్ ఫోర్కు అర్హత సాధిస్తాం. అక్కడి నుంచి కొత్త టోర్నీలా భావించి ముందుకు వెళ్లాలి’ సల్మాన్ అఘా తెలిపాడు.
