BCCI Chief Selector Race: టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన కాంట్రాక్ట్ అక్టోబర్ 4తో ముగియనుంది. ఈ నేపథ్యంలో అగార్కర్ పదవీకాలంను మరోసారి పొడిగించే అంశంపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్ వరకు అగార్కర్ను కొనసాగిస్తారనే ప్రచారం గతంలో జరిగినప్పటికీ.. ప్రస్తుతం ఆయన స్థానంలో కొత్త చీఫ్ సెలెక్టర్ను నియమించే దిశగా బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. చీఫ్ సెలెక్టర్ రేసులో మాజీ భారత క్రికెటర్లు పార్థివ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓజాలు ఉన్నారు. వీరిద్దరూ చీఫ్ సెలెక్టర్ పదవికి ప్రధాన అభ్యర్థులుగా ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపినట్లు తెలుస్తోంది. పార్థివ్, ప్రజ్ఞాన్ ఇద్దరూ ఐపీఎల్లో మూడుసార్లు విజేతలుగా నిలిచిన జట్లలో సభ్యులుగా ఉన్నారు. బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) శుక్రవారం జరగనుంది. ఈ సమావేశంలో అగార్కర్ కాంట్రాక్ట్ పొడిగింపుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. బుధవారం జరిగిన సెలెక్షన్ మీటింగే అగార్కర్ చీఫ్ సెలెక్టర్గా అధ్యక్షత వహించిన చివరి సమావేశం అయి ఉండొచ్చని సమాచారం. ఏజీఎం సమావేశం అనంతరం చీఫ్ సెలెక్టర్ వ్యవహారంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
బుధవారం జరిగిన సమావేశంలో వెస్టిండీస్తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్లకు భారత జట్లను ప్రకటించారు. అలాగే ఇరానీ కప్ కోసం రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టును కూడా ఎంపిక చేశారు. ఈ ఎంపిక ప్రక్రియకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ అధ్యక్షత వహించింది. వెస్టిండీస్తో జరగనున్న మూడు వన్డేల సిరీస్కు సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మను ఎంపిక చేయడం కూడా ఆసక్తికరంగా మారింది. 39 ఏళ్ల రోహిత్ను వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్ ప్రణాళికల్లో భాగంగా చూడటం లేదని సెలెక్టర్లు గతంలో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వెస్టిండీస్ సిరీస్కు చోటు దక్కడం చర్చకు దారితీసింది.

