ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా (24) తన రికార్డునే తానే బద్దలుకొట్టుకున్నాడు. ఫిన్లాండ్లో జరిగిన పావో నుర్మీ గేమ్స్లో 89.30 మీటర్ల దూరంలో జావెలిన్ త్రో వేసి రికార్డు సృష్టించాడు. దీంతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలుకొట్టుకున్నాడు. నీరజ్ చోప్రా గత ఏడాది మార్చిలో పాటియాలలో 88.07 మీటర్లు విసిరాడు. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేశాడు. అంతేకాకుండా 2021, ఆగస్టు 7న టోక్యో ఒలింపిక్స్లో 87.58 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం గెల్చుకున్నాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారత్కు తొలి స్వర్ణం అందించిన అథ్లెట్గా చరిత్రలో నిలిచాడు.
టోక్యో ఒలింపిక్స్ తర్వాత దాదాపు 10 నెలల పాటు నీరజ్ చోప్రా విశ్రాంతి తీసుకున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఫిన్లాండ్లో జరుగుతున్న పావో నుర్మీ గేమ్స్ బరిలోకి దిగాడు. ఈ పోటీల్లో తొలి ప్రయత్నంలో 86.92 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా.. రెండో ప్రయత్నంలో 89.30 మీటర్లు విసిరాడు. ఆ తర్వాత మూడు ప్రయత్నాలు విఫలం కాగా చివరి ప్రయత్నంలో 85.85కే పరిమితమయ్యాడు. కాగా జావెలిన్ త్రో విభాగంలో ఫిన్లాండ్కు చెందిన ఓలీవర్ హీలేండర్ 89.83 మీటర్లతో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
ENG Vs NZ: బెయిర్స్టో టీ20 బ్యాటింగ్.. రెండో టెస్టు కూడా ఇంగ్లండ్దే